హైదరాబాద్, జూన్ 28: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 10వ తరగతి, 12వ తరగతి సప్లిమెంటరీ పరీక్షల టైం టేబుల్ విడుదల చేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం 10వ తరగతి పరీక్షలు జూలై 15 నుంచి జూలై 22 వరకు నిర్వహించనున్నారు. ఇక 12వ తరగతి పరీక్షలు జూలై 15న ఒకరోజు మాత్రమే పరీక్షలు నిర్వహించనున్నట్లు బోర్డు తెలిపింది. 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేపర్లతో ప్రారంభమవుతాయి. 12వ తరగతి అన్ని పేపర్లు జూలై 15వ తేదీన కేవలం ఒకే ఒక్క రోజులో నిర్వహించి, ముగించనున్నట్లు CBSE బోర్డు తన ప్రకటనలో తెలిపింది. పదో తరగతి, 12వ తరగతుల పరీక్షలు కొన్ని రోజులు ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు, మరికొన్ని రోజులలో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు సబ్జెక్టును బట్టి నిర్వహించనున్నారు.
CBSE పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల 2025 టైం టేబుల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CBSE 12వ తరగతి సప్లిమెంటరీ పరీక్షల 2025 టైం టేబుల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇవి కూడా చదవండి
విద్యార్థులకు బోర్డు కీలక సూచనలు
- పరీక్షా కేంద్రం లోపల కమ్యూనికేషన్ పరికరాలను ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించరు. వాటిని పరీక్ష కేంద్రంలోకి తీసుకురావడం, ఉపయోగించడంపై కఠిన చర్యలు ఉంటాయని సీబీఎస్సీ బోర్డు హెచ్చరించింది.
- అభ్యర్థులు పరీక్షా కేంద్రంలో క్రమశిక్షణ పాటించాలి.
- ప్రతి పరీక్ష వ్యవధి, తేదీ అడ్మిట్ కార్డులో పేర్కొన్న విధంగానే జరుగుతుంది.
- పరీక్ష ప్రారంభమయ్యే ముందు విద్యార్థులకు ప్రశ్నపత్రం చదవడానికి 15 నిమిషాల సమయం ఇస్తారు.
సీబీఎస్సీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులు ఇతర తాజా విషయాల కోసం అధికారిక CBSE వెబ్సైట్ను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని అధికారులు సూచించారు. కాగా CBSE 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి 10వ తరగతి, 12వ తరగతి బోర్డు పరీక్ష ఫలితాలను మే 13న ప్రకటించిన సంగతి తెలిసిందే. మొత్తం ఉత్తీర్ణత శాతం 88.39%గా నమోదైంది. ఇది గత ఏడాది కంటే స్వల్ప పెరుగుదలను సూచిస్తుంది. విజయవాడ.. సీబీఎస్సీ 12వ తరగతి ఫలితాల్లో 99.60% ఉత్తీర్ణతతో అగ్రస్థానంలో నిలిచింది. ఇక 10వ తరగతిలో మొత్తం ఉత్తీర్ణత శాతం 93.66%గా ఉంది. త్రివేండ్రం 99.79%తో అగ్రస్థానంలో నిలిచింది.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.