రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఇటీవలే ఏడాది పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వం.. పాలనలో తమదైన రీతిలో ముందుకెళ్తోంది. ఓ వైపు రాష్ట్రాన్ని అభివృద్ధివైపు నడిపిస్తూ.. మరో వైపు ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో ఎన్నికల్లో ఇచ్చిన “సూపర్ సిక్స్” హామీల్లో ఒకటైన అన్నదాత సుఖీభవ పథకం అమలులోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ నెల 30వ తేదీ లోపు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 47.77 లక్షల మంది అర్హులైన రైతు కుటుంబాల ఖాతాల్లో నిధులు జమ చేయాలని ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది.
అన్నదాత సుఖీభవ లబ్ధిదారులు వీళ్లే…
వ్యవసాయశాఖ డైరెక్టర్ ఢిల్లీ రావు ప్రకారం ‘అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్’ పథకం కింద అర్హత కలిగిన రైతులను గ్రామ/వార్డు సచివాలయాల సర్వే ఆధారంగా గుర్తించామన్నారు. ఇప్పటివరకు 98% మంది రైతులు ఈకేవైసీ పూర్తిచేయగా, మిగిలిన 61 వేల మంది రైతులు త్వరగా పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. సొంత భూమి కలిగిన డి-పట్టాదారులు, ఎసైన్డ్ భూములు, ఈనాం భూములపై సాగు చేసే రైతులు అర్హులుగా గుర్తించబడినట్టు తెలిపారు. ఆధార్ లింకింగ్ లో లోపాలు, చనిపోయిన ఖాతాల వ్యవహారాలపై కూడా రైతులు సంబంధిత రెవెన్యూ అధికారులను సంప్రదించాలని సూచించారు. ఇవన్నీ సరిచేసుకున్న అనంతరం వారికి కూడా సుఖీభవ వర్తింపజేస్తామని తెలిపారు. రైతుల డేటాను మరింత సమగ్రంగా నిర్వహించేందుకు త్వరలో అన్నదాత సుఖీభవ పోర్టల్ ప్రారంభించనున్నట్లు ఢిల్లీ రావు వివరించారు.
వీరూ కూడా ఈ పథకానికి అర్హులే..
భూమిలేని ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఇతర వర్గాల కౌలు రైతులు కూడా ఈ పథకానికి అర్హులేనని ఆయన తెలిపారు. వారు గుర్తింపు కార్డు పొందడం, ఈ-పంటలో నమోదు చేయించుకోవడం ద్వారా ప్రయోజనం పొందవచ్చన్నారు. కౌలు రైతులకు 2026 అక్టోబర్, జనవరిలో రెండు విడతలుగా నిధులు అందజేయనున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తన వాటా విడుదల చేసిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కూడా తక్షణమే నిధులు జమ చేయనుంది. ఈ నెల 30 న ఈ నిధులు విడుదల చేసేందుకు ఆర్ధిక శాఖ కు ప్రభుత్వం ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..