Andhra Pradesh More Than 2 Children Must Rule,ఏపీలో వాళ్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అర్హులు కాదా.. ఓహో అసలు సంగతి ఇదా? – andhra pradesh fact check team gives clarity on more than 2 children must for local polls rule
Andhra Pradesh Two Kids Election Rule: ఏపీలో స్థానిక ఎన్నికల పోటీపై ఒక విచిత్రమైన ప్రచారం వైరల్ అయింది. ఇద్దరు పిల్లలు లేని వారు అనర్హులా? చంద్రబాబు చెప్పారా ఇది నిజమా? దీనిపై ప్రభుత్వం స్పందించింది. అసలు నిజం వేరే ఉంది! పాత నిబంధనను తొలగిస్తూ కొత్త జీవో తెచ్చారు. అసలు విషయం తెలుసుకోకుండా తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ ప్రచారం వెనుక అసలు కథేంటో తెలుసా?
హైలైట్:
ఇద్దరు పిల్లలు లేని వారు ఎన్నికల పోటీకి అనర్హులా
సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది
ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ ఈ అంశంపై క్లారిటీ ఇచ్చింది
ఏపీ ఎన్నికలు ఇద్దరు పిల్లల నిబంధన (ఫోటోలు– Samayam Telugu)
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఇద్దరి కంటే తక్కువమంది పిల్లలు ఉంటే అనర్హులా?.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ఈ విషయాన్ని చెప్పారా?.. రెండు, మూడు రోజులుగా సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరుగుతోంది. ‘రాష్ట్రంలో ఇద్దరి కంటే తక్కువమంది పిల్లలు ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులు అని చంద్రబాబు వెల్లడించారు. యూపీ, బీహార్లో జనాభా బాగా పెరుగుతోందని.. యూపీ, బీహార్ మినహా మిగతా రాష్ట్రాల్లో జనాభా పెరడం లేదన్నారు. పిల్లలు భారం కాకూడదు.. వారిని ఆస్తిగా పరిగణించాలని చంద్రబాబు ప్రజలకు సూచించారు’ అంటూ కొన్ని వార్తలు వైరల్ అయ్యాయి. అలాగే సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరిగింది. మరి నిజంగానే ఇద్దరు కంటే తక్కువమంది ఉంటే ఎన్నికల్లో పోటీకి అనర్హులా? అని ఆరా తీస్తే అసలు విషయం తెలిసింది. ఈ అంశంపై తప్పుడు ప్రచారం జరుగుతున్నట్లు తేలింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఫ్యాక్ట్ చెక్ టీమ్ స్పందించింది. ఈ అంశంపై క్లారిటీ ఇచ్చింది. ‘స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడానికి “ఇద్దరు పిల్లల కన్నా ఎక్కువ మంది సంతానం ఉన్నవాళ్లే అర్హులు” అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించినట్టు జరుగుతున్న ప్రచారం అబద్ధం. 1994లో ఆనాటి పరిస్థితుల దృష్ట్యా “ఇద్దరు పిల్లల కన్నా మించి సంతానం ఉంటే వారు స్థానిక ఎన్నికల్లో పోటీకి అనర్హులు” అని నాటి ప్రభుత్వాలు నిబంధన పెట్టాయి. కానీ ఆ నిబంధనను పంచాయతీ రాజ్ చట్టం నుంచి తొలగిస్తూ.. కూటమి ప్రభుత్వం గత ఫిబ్రవరిలో సవరణ తెచ్చింది. ఫిబ్రవరి 11, 2025 నుంచి అమలులోకి వచ్చిన ఈ సవరణ పై న్యాయశాఖ గెజిట్ నోటిఫికేషన్ కూడా అప్పుడే జారీ చేసింది’ అని తెలిపారు.
ఏపీలో వాళ్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అర్హులు కాదా.. ఓహో అసలు సంగతి ఇదా?
‘అంటే “ఇద్దరు పిల్లల కంటే ఎక్కువమంది సంతానం ఉన్నవారు కూడా స్థానిక ఎన్నికల్లో పోటీ చేయవచ్చు” అన్నది నాటి జివో సారాంశం. స్పష్టత కోసం ఆ జీవోను కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీన్ని పక్కదోవ పట్టిస్తూ.. “ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటేనే పోటీకి అర్హులు” అన్నట్టుగా కొందరు ఫేక్ ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలను ప్రజలెవరూ నమ్మవద్దు. అంతేకాదు ప్రభుత్వం పై ఇలాంటి ఫేక్ ప్రచారాలు చేసే వారిపై కేసులు పెట్టడం జరుగుతుంది. కాబట్టి తదుపరి చర్యలకు ఈ ఫేక్ ప్రచారకర్తలే బాధ్యులు’ అంటూ ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ ట్వీట్ చేసింది. ఈ మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసే అంశంపై క్లారిటీ ఇచ్చింది.
రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి