కొడాలి నానికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది గుడివాడ కోర్టు. మాజీ MLA రావి వస్త్ర దుకాణంపై దాడి కేసులో షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది కోర్టు. మంగళవారం, శనివారం గుడివాడ పీఎస్లో సంతకం చేయాలని షరతు విధించింది. దిగువ కోర్టులో బెయిల్ తీసుకోవాలన్న హైకోర్టు ఆదేశాలతో స్వయంగా వచ్చి దరఖాస్తు చేసుకున్నారు కొడాలి నాని. హామీ పత్రాలు సమర్పించారు. ఈ కేసులో 16 మంది నాని అనుచరులు ఇప్పటికే బెయిల్పై విడుదలయ్యారు. అయితే కొడాలి నాని చెబితేనే దాడి చేశామని వీరంతా పోలీస్ కస్టడీలో అంగీకరించినట్ట తెలుస్తోంది. దీంతో కొడాలి నానిపై కేసు నమోదైంది. ఆ తర్వాత అనారోగ్య కారణాలతో గుడివాడలో కనిపించకుండాపోయారు కొడాలి నాని. ఏడాది తర్వాత గుడివాడలో నాని కనిపించడంతో వైసీపీ శ్రేణులు కోర్టు దగ్గరకు భారీగా తరలివచ్చారు. గత కొంతకాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న కొడాలి నానికి హైదరాబాద్, ముంబైలోని హాస్పిటల్స్లో చికిత్స జరిగింది.
కొడాలి నాని ఆ బెల్డ్ ధరించింది ఎందుకంటే..?
గుడివాడ వచ్చిన కొడాలి నాని ఛాతీకి బెల్టు పెట్టుకుని కనిపించారు. ఆయనకు ఇటీవల గుండె ఆపరేషన్ జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో డాక్టర్ల సూచన మేరకు ఆ బెల్టును ధరించారు. ఆ బెల్టులో ఒక మెషిన్ ఉంటుందని.. అది నిరంతరం గుండెకు సంబంధించి అన్ని విషయాలను మోనిటరింగ్ చేస్తుందని చెబుతున్నారు. గుండెకు సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఉన్నా.. వెంటనే అలెర్ట్ చేస్తుందట. కొన్ని నెలల తర్వాత కొడాలి నాని గుడివాడ రావడంతో వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఆయన్ను కలిసేందుకు భారీగా తరలివచ్చారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..