ఆంద్రప్రదేశ్ లో పర్యాటక రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. విజయవాడలో జరిగిన టూరిజం కాంక్లేవ్లో నూతన క్యారవ్యాన్ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ఆంధ్రప్రదేశ్ను ప్రపంచ పర్యాటక చిత్రపటంలో అగ్రస్థానంలో నిలబెడతామని, గ్లోబల్ టూరిజం డెస్టినేషన్గా తీర్చిదిద్దుతామన్నారు. పర్యాటక రంగం రాష్ట్ర భవిష్యత్తుకు గేమ్ ఛేంజర్ వంటిదని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో పాటుగా పర్యటకశాఖ మంత్రి కందుల దుర్గేష్ ,యోగా గురువు రాందేవ్ బాబా ,విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ,తదితరులు పాల్గొన్నారు. టూరిజం కాంక్లేవ్లో భాగంగా నడిచే హోటల్ రూమ్గా తీర్చిదిద్దిన క్యారవ్యాన్తో పాటు మరో రెండు వాహనాలను సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు.
ఇప్పుడు ఏపీలో నూతన క్యారవ్యాన్లు అందరి దృష్టిని అకర్షించాయి. అయితే ఇంతకీ ఈ క్యారవ్యాన్ స్పెషాలిటీ ఏమిటి అనుకుంటున్నారా.. క్యారవాన్ అంటే మొబైల్ హాలిడే వెహికల్. ఫ్యామిలీతో టూర్ కి వెళ్లే వారికి ఇది చాలా బెస్ట్ అప్షన్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇది అచ్చం మనం ఇంట్లో ఉన్న అనుభూతిని కలిగిస్తుంది. ఈ క్యారవేన్లోపలే చిన్న కిచెన్, స్టవ్ ,ఫ్రీజ్ ,టేబుల్,కుర్చీల వంటి సకల సౌకర్యాలతో పాటు నిద్రించడానికి బెడ్స్ కూడా ఉంటాయి. అంతే కాదు ఏసీ,వైఫై, టీవీ వంటి సదుపాయాలు కూడా క్యారవేన్లో ఉన్నాయి.
ఈ క్యారవ్యాన్ సర్వీస్ను ఇప్పటికే కేరళ, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లోని టూరిజం శాఖల్లో ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు వాటిలో ఆంద్రప్రదేశ్ కూడా చేరింది. ఆ టూరిజం క్యారవ్యాన్లను ఏపీ టూరిజం అభివృద్ధిలో గేమ్ ఛేంజర్గా భావిస్తున్నారు. వీటి బుకింగ్ , ధరల వివరాలను త్వరలో అధికారులు ప్రకటించనున్నారు. అయితే ప్రయాణికులకు అందుబాటులో ఉండే ధరలనే అధికారులు నిర్ణయించనున్నట్టు తెలుస్తోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..