అధిక వడ్డీకి ఆశపడి సామాన్యులు మోసపోతుంటారు. కానీ ఇక్కడ 300 కోట్లకు ఎగనామం పెట్టిన అద్విక ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో పెట్టుబడి పెట్టిన వారంతా ప్రభుత్వ అధికారులు, పోలీసులు, వైద్యులేనంటే నమ్ముతారా? నమ్మాల్సిందే.. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఏలూరు జిల్లాలకు చెందిన రాజకీయ నాయకులు సైతం కనీసం ఆ కంపెనీ వివరాలు తెలుసుకోకుండా పెట్టుబడి పెట్టి మోసపోయిన ఉదంతాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి.
విజయవాడలోని అద్విక ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయం..‘అద్విక’లో పెట్టుబడులు పెట్టి మోసపోయామని తెలిసి పోలీస్ స్టేషన్కి క్యూ కట్టారు బాధితులు.1200 మంది ఖాతాదారులు 300 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టారు…కంపెనీ బోర్డు తిప్పేయడంతో లబోదిబోమంటున్నారు. లక్ష పెట్టుబడి పెడితే, నెలకు 6 వేలు వడ్డీ చెల్లిస్తామని చెప్పి ఏజెంట్లు, ఖాతాదారులకు ఝలక్ ఇచ్చిన విజయవాడలోనిఅద్విక ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఎండీ తాడేపల్లి శ్రీవెంకట ఆదిత్యతో పాటు కిరణ్ అనే ఉద్యోగిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే ఆదిత్య చేసిన లీలలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. మొత్తం 1200 మంది ఖాతాదారుల నుంచి 300 కోట్లను పెట్టుబడిగా వసూలుచేసి బోర్డు తిప్పేయడంతో ఈయన లీలలు వెలుగులోకి వస్తున్నాయి.
ఇలా పెట్టుబడులు పెట్టిన వారిలో కొందరికి అసలు ఆదిత్య అంటే ఎవరో తెలియదు. అతని ముఖం కూడా చూడలేదు. కొంతమంది ప్రత్యక్షంగా వారి కుటుంబ సభ్యుల పేర్లతో పెట్టుబడులు పెట్టగా, మరికొందరు స్నేహితుల ద్వారా డబ్బు పెట్టించారు. బాధితులకు ఫిర్యాదుతో ఆదిత్యను తీసుకుని అద్విక కార్యాలయానికి వెళ్లారు. లోపల రికార్డులను, పెట్టుబడిదారుల వివరాలను పరిశీలించారు. ఖాతాల వివరాలు తెలుసుకున్నారు. ఆదిత్య వెనుక ఇంకా మరికొంతమంది ఉన్నట్టు గుర్తించారు. పోలీసులు అరెస్టు చేయడానికి ముందు ఆదిత్య.. ఏజెంట్లతో సమావేశం నిర్వహించాడు. అప్పటికే నష్టాలు ఉన్నాయని తెలిసినా ఏజెంట్లను నమ్మించే ప్రయత్నం చేశాడు. తనను నమ్మితే మొత్తం చెల్లింపులు చేస్తానని భరోసా ఇచ్చాడు. ఈ ప్రయత్నం బెడిసికొట్టింది. ఇక తాము నమ్మలేమని ఏజెంట్లు మూకుమ్మడిగా చెప్పారు. పెట్టుబడులుగా వసూలు చేసిన నిధులను ఆదిత్య హవాలా మార్గంలో దుబాయికి మళ్లించినట్టు పోలీసులు గుర్తించారు. దుబాయిలో షబానా అనే ట్రేడింగ్ కంపెనీకి ఈ డబ్బు వెళ్లినట్టు తేల్చారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..