హైదరాబాద్ శివారు శంకర్పల్లి సమీపంలో రైలు పట్టాలపై సుమారు 7 కిలోమీటర్లు కారు నడిపిన 34 ఏళ్ల మహిళను పోలీసు అధికారులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటన గురువారం, జూన్ 26న చోటు చేసుకుంది. ఆత్మహత్యాయత్నంగా భావిస్తున్న ఈ ఘటన తర్వాత ఆమెను మానసిక స్థితిని రివ్యూ చేసేందుకు ఎర్రగడ్డ మానసిక ఆరోగ్య సంస్థలో చేర్చారు.
లక్నోకు చెందిన ఈ మహిళ గతంలో గచ్చిబౌలిలోని ఐటీ కంపెనీలో ఉద్యోగం చేసేది. ఇటీవలే ఆమెకు విడాకులు కూడా మంజూరు కావడంతో మానసికంగా తీవ్రంగా దెబ్బతిన్నట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలోనే నాగులపల్లిలో కారుతో రైలు ట్రాక్లోకి ప్రవేశించిన ఆమె.. శంకర్పల్లి దిశగా ప్రయాణించడంతో రైలు రాకపోకలకు అంతరాయం కలిగింది. అధికారుల సహకారంతో ట్రైన్ సర్వీసులను సుమారు గంట పాటు నిలిపివేయాల్సి వచ్చింది. కొన్ని ప్యాసింజర్, గూడ్స్ ట్రైన్స్ ఆలస్యంగా నడిచాయి. సమయానికి స్పందించిన ప్రభుత్వ రైల్వే పోలీసులు (GRP) ఆమెను రక్షించారు. ఆమెను ముందుగా ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక పరీక్షలు నిర్వహించిన అనంతరం మానసిక స్థితి అంచనా కోసం ఎర్రగడ్డ IMHకు తరలించారు.
ఈ ఘటనపై BNS, రైల్వే చట్టం ప్రకారం పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అలాగే, ఆమెను కేసు దర్యాప్తు అధికారుల ముందు హాజరు కావాల్సిందిగా BNSSలోని సెక్షన్ 35 కింద నోటీసు జారీ చేశారు. ఇంతే కాకుండా.. అరెస్టు సమయంలో పోలీసులపై రాళ్లు రువ్విన ఆరోపణలపై శంకర్పల్లి పోలీసులు ఆమెపై మరో కేసు నమోదు చేశారు. ఆసుపత్రిలో ఉన్న ఆమెకు మరో నోటీసు కూడా ఇచ్చే ప్రక్రియలో ఉన్నట్లు అధికారులు తెలిపారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..