ఆంధ్రప్రదేశ్లో నగరాల అభివృద్ధికి ఇప్పుడు కొత్త ఊపు వచ్చింది. రాష్ట్రంలో మున్సిపల్ శాఖ పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చూపిస్తున్న చొరవ, స్పష్టత నగర పాలనకు కొత్త ప్రాణం పోస్తోంది. తాజాగా ఆయన ఉండవల్లి నివాసంలో మంత్రి నారాయణతోపాటు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తీసుకున్న కీలక నిర్ణయాలు, మున్సిపాలిటీలపై పెట్టుబడుల పరంపర ఏపీ పట్టణాల భవిష్యత్తును వెలుగులోకి తీసుకువస్తున్నాయి.
చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం కలిగి, డబుల్ ఇంజిన్ సర్కార్గా ఉండడం వల్ల అనేక ప్రాజెక్టులకు నిధులు వరదలా వచ్చిపడుతున్నాయి. తాజాగా AIIB – ఆసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ నుంచి రూ. 5,800 కోట్లు, స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా రూ. 3,000 కోట్లు కేంద్రం నుంచి రాష్ట్రానికి మంజూరు అయ్యాయి. అయితే గత ప్రభుత్వ కాలంలో రాష్ట్ర వాటా ఇవ్వకపోవడంతో ఈ నిధుల విడుదల నిలిచిపోయింది. ఇప్పుడు తిరిగి చంద్రబాబు సీఎం అయిన తర్వాత అనేక విధుల సమస్యలను పరిష్కరించి, అదే ప్రాజెక్టులకే మళ్లీ నిధులు తీసుకొచ్చేలా కృషి చేస్తున్నారు.
అమృత్ స్కీమ్ ద్వారా తాగునీటి పైప్లైన్ పనుల కోసం తాజాగా టెండర్లు పిలవడం జరిగింది. వీటితో 85 శాతం ఇళ్లకు నేరుగా నదులు, కాలువల ద్వారా నీరు అందేలా ప్రణాళిక. AIIB నిధులతో రూ. 5,350 కోట్ల పనులకు వారం రోజుల్లో టెండర్లు పిలవనున్నట్లు మంత్రి నారాయణ ప్రకటించారు. 2029 నాటికి అన్ని పట్టణాల్లో 100% STP (శుద్ధి చేసిన నీటి ప్లాంట్లు) ఏర్పాటు చేస్తామని సీఎం స్పష్టం చేశారు. డ్రైన్లలో బాగా శుద్ధి చేసిన నీటినే వదిలేలా చర్యలు తీసుకుంటామన్నారు.
గత ప్రభుత్వ కాలంలో నిలిచిపోయిన పేరుకుపోయిన చెత్త తొలగింపును అక్టోబర్ 2 నాటికి పూర్తి చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు. గుంటూరు, విశాఖలో ఇప్పటికే 2800 టన్నుల చెత్త నుంచి విద్యుత్ తయారీ జరుగుతోంది. నెల్లూరు, రాజమండ్రి ప్లాంట్లకు టెండర్లు పూర్తయ్యాయి. కడప, కర్నూలు, విజయవాడ, తిరుపతిలో ప్లాంట్లకు త్వరలో టెండర్లు పిలవనున్నారు. ఈ ప్లాంట్లు పూర్తయితే రోజుకు 7500 టన్నుల చెత్త విద్యుత్ ఉత్పత్తికి వాడబడుతుంది. మిగతా 500 టన్నుల చెత్తను ఇతర పద్ధతుల్లో నిర్వహిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. కంపాక్టర్లు, స్వీపింగ్ మెషీన్ల కొనుగోలుకు రూ. 225 కోట్లు కేటాయించడం జరిగింది. మున్సిపాలిటీల్లో పారిశుధ్య నిర్వహణను ఆధునీకరించే దిశగా అడుగులు వేస్తున్నారు.
గతంలో నిర్మాణంలో ఉన్న టిడ్కో ఇళ్లను వీలైనంత త్వరగా పూర్తిచేసి లబ్ధిదారులకు అందించేలా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది. ఇది పట్టణాల్లో నివాస సమస్యకు స్థిర పరిష్కారంగా మారనుంది. త్వరలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమ్మె అంశాన్ని మంత్రివర్గ ఉపసంఘం పరిశీలించి త్వరలో తగిన నిర్ణయం తీసుకోనుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..