భువనేశ్వర్- సికింద్రాబాద్ విశాఖ ఎక్స్ప్రెస్లో దుండగులు దోపిడీకి యత్నించగా, పల్నాడు జిల్లా పిడుగురాళ్ల వద్ద రైల్వే పోలీసులు కాల్పులు జరిపారు. సిగ్నల్ ట్యాంపరింగ్ చేసి రైలును ఆపి దోపిడీకి పాల్పడుతున్న ముఠాలు ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. రెండు రోజుల వ్యవధిలో ఇది రెండో ఘటన కావడంతో, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ తరహా నేరాలకు పాల్పడుతున్న మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్, బీహార్ ముఠాలపై నిఘా పెట్టారు.
హైలైట్:
- ఆందోళనకు గురిచేస్తోన్న సిగ్నల్ ట్యాంపరింగ్ ఘటనలు
- 48 గంటల వ్యవధిలో న్యూపిడుగురాళ్లలో రెండో ఘటన
- అనంతపురంలో చెంగల్పట్టు ఎక్స్ప్రెస్లో దోపిడీ

సిగ్నల్స్ను ట్యాంపరింగ్ చేసి రైళ్లను ఆపి దొంగతనాలు చేస్తున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి సంఘటనలు కలవరానికి గురిచేస్తున్నాయి. ఒంగోలు, రేణిగుంట, అలంపూర్, మానవపాడు, ఇటిక్యాల స్టేషన్ల పరిధిలో ఇదివరకే ఇలాంటి ఘటనలు జరిగాయి. మూడు రోజుల కిందట అనంతపురం జిల్లాలో చెంగల్పట్టు ఎక్స్ప్రెస్ రైలును ఆపి మహిళ మెడలోంచి 2.7 తులాల బంగారు ఆభరణాలు దొంగిలించారు. మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్, బిహార్కు చెందిన ముఠాలే ఈ తరహా దొంగతనాలకు పాల్పడుతున్న రైల్వే పోలీసులు అనుమానిస్తున్నారు.
ఒకప్పుడు రైళ్లలో దొంగతనాలు రైలు క్రాసింగ్ కోసం ఆగినప్పుడు లేదా ప్రయాణికుల్లా నటిస్తూ చేసేవారు. స్టేషన్లలో రైళ్లు ఆగినప్పుడు కిటికీల నుంచి చేతులు పెట్టి ఆభరణాలు దొంగిలించేవారు. కానీ ఇప్పుడు సిగ్నల్స్ను ట్యాంపరింగ్ చేసి రైళ్లు ఆపేసి దొంగతనాలు చేస్తున్నారు. ఈ దొంగతనాలకు పాల్పడుతున్న వారిలో షోలాపూర్ గ్యాంగ్, పార్థీ గ్యాంగ్, మీర్జాపూర్ గ్యాంగ్లతో పాటు జామ్కేడ్, బీడ్ ప్రాంతాలకు చెందిన నేరస్థులు ఉన్నారని రైల్వే పోలీసులు గుర్తించారు.