అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ద తండ్రికి అవసాన దశలో సపర్యలు చేయని పిల్లలు అంత్యక్రియలు చేయవద్దంటూ గ్రామస్థులు అడ్డుకున్న సంఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. మెదక్ జిల్లా తూప్రాన్ పట్టూరులో వట్టూరు గ్రామానికి చెందిన దేవయ్య, నరసమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. అందరికీ వివాహాలయ్యాయి. నరసమ్మ 8 ఏళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందింది. అప్పటినుంచి దేవయ్య ఒక్కడే గ్రామంలోని సొంతింట్లో ఉంటున్నాడు..కొన్ని నెలల కిందకు ఇంట్లో జారిపడి కాలు విరిగింది. దేవయ్యకు వైద్యం చేయించేందుకు పిల్లలెవరూ ముందుకు రాలేదు. గ్రామస్థుల సూచన మేరకు చిన్న కొడుకు శ్రీనివాస్ తండ్రిని తీసుకెళ్లి వైద్యం చేయించాడు..కానీ, ఇటివలే అతను ఆత్మహత్య చేసుకుని మరణించాడు. దీంతో దేవయ్య పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది.
సొంతూరుకు వచ్చిన దేవయ్య ఒక్కడే ఉంటున్నాడు. పది రోజుల క్రితం మరోసారి కిందపడి గాయాలపాలయ్యాడు. గ్రామస్థులు ఆయన సంతానానికి సమాచారం ఇచ్చినా స్పందించలేదు. గ్రామస్థులే చొరవ తీసుకొని ఓ వ్యక్తికి డబ్బులిచ్చి సేవ చేసేందుకు నియమించారు. ఈ క్రమంలో దేవయ్య శుక్రవారం రాత్రి మృతి చెందాడు. ఇది తెలిసి దేవయ్య పిల్లలందరూ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు శనివారం గ్రామానికి వచ్చారు. అనారోగ్యంతో ఉన్న తండ్రికి సేవ చేయని వారు అంత్యక్రియలు చేసేందుకు అనర్హులంటూ గ్రామస్థులు అడ్డుకున్నారు.
తండ్రికి ఎంతోకొంత సేవ చేసిన శ్రీనివాస్ కొడుకు సాయిరాంతో దగ్గరుండి అంత్యక్రియలు చేయించారు. ఇదంతా ముగ్గురు కుమార్తెలు, కొడుకు దూరం నుంచి చూస్తూ ఉండిపోయారు. ఇది స్థానికంగా తీవ్ర చర్చనీ యాంశమైంది.
ఇవి కూడా చదవండి
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి