భార్యభర్తల మధ్య గొడవ అత్తింటిపై సుతిల్ బాంబులతో దాడి వరకు వెళ్లింది. ఆ తర్వాత జైలుకు వెళ్లొచ్చిన అల్లుడు.. కేసు విచారణ కోసం వచ్చి, ఫ్యామిలీతో సహా కోర్టుపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది.. ఈ విషాద ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో పిల్లలతో సహా ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు దంపతులు. ఇద్దరు పిల్లలను భవనంపై నుంచి కిందకు తోసేసి భార్య భర్తలు దూకేశారు. భార్య రమ్య అక్కడికక్కడే మృతి చెందగా.. భర్త, ఇద్దరు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. నవీన్, ఇద్దరు కూతుళ్లకు తీవ్ర గాయలవ్వడంతో హైద్రాబాద్ గాంధీకి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మెదక్ జిల్లా రామాయంపేట మండలం లక్ష్మాపూర్కు చెందిన రమ్యను సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ గ్రామానికి చెందిన నవీన్ గౌడ్కు ఇచ్చి.. ఏడేళ్ల క్రితం వివాహం చేశారు తల్లిదండ్రులు. నవీన్ ఆటో డ్రైవర్గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. భార్యభర్తల మధ్య గొడవలతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. భార్యను కాపురానికి పంపకపోవడంతో ఆగ్రహించిన నవీన్.. భయపెట్టేందుకు లక్ష్మాపూర్ వెళ్లి అత్తింటిపై సుతీల్ బాంబ్లు వేశాడు.
రమ్య పేరెంట్స్ కేసు పెట్టడంతో.. నవీన్ జైలుకు వెళ్లొచ్చాడు. ఇదే కేసు విచారణలో భాగంగా మెదక్ కోర్టుకు నవీన్, రమ్య, ఇద్దరు కుమార్తెలతో కలిసి వచ్చారు. కోర్ట్ సముదాయం భవనంపై నుంచి దూకేశారు. నవీన్ కాలు, వెన్ను పూస దెబ్బతిన్నాయి. పెద్ద కుమార్తె రిత్వికకు చేయి విరిగింది. చిన్న కుమార్తె యశ్వికకు గాయాలయ్యాయి. నవీన్, ఇద్దరు పిల్లలకు మెదక్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స తర్వాత.. వారిని హైదరాబాద్ తరలించారు. నవీన్ను గాంధీ ఆస్పత్రికి, పిల్లలను నీలోఫర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
గొడవల నేపథ్యంలో కోర్టు హియరింగ్ కు వచ్చిన నవీన్, రమ్య పాటు ఇద్దరు పిల్లలు మెదక్ కోర్టులో 6 గంటల సమయంలో కోర్టు మూడవ అంతస్తు పైకి వెళ్ళారు. మూడో అంతస్తులో సుమారు రెండు గంటల పాటు నవీన్, రమ్య మాట్లాడుకున్నారు.. అక్కడ ఇద్దరి మధ్య ఏం జరిగిందనే విషయం విచారణ అనంతరం తెలుస్తుందని అధికారులు తెలిపారు. అయితే.. భార్య, పిల్లలను కోర్టు బిల్డింగ్పై నుంచి భర్తే నెట్టేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..