ఆదివారం మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రం ధ్వంసమైందని, కేంద్ర ప్రభుత్వ పథకాలను వైసీపీ ప్రభుత్వం పక్కదారి పట్టించిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో వ్యవస్థలను గాడిలో పెడుతూ, టీడీపీ, జనసేన, బీజేపీ సమన్వయంగా ముందుకెళ్తున్నామని తెలిపారు. ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్ఛార్జ్లకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. పనితీరు బాలా లేకుంటే ఉపేక్షించేది లేదని.. ఇక వాళ్లకు గుడ్బై చెప్పాల్సి వస్తుందని ఆయన అన్నారు.
రాష్ట్ర విభజన సమయంలో ఎన్ని సమస్యలు ఎదురైనా నిలదొక్కుకున్నామని.. తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని నాశనం చేసిందన్నారు. మళ్లీ తాయు అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని విధ్వంసం నుంచి వికాసం వైపు తీసుకెళ్తామని సీఎం అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల ప్రకారం రాష్ట్ర సుపరిపాలనలో తొలి అడుగు వేశామని సీఎం అన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ.. వారి సమస్యలను తెలుసుకొని ఎప్పటికప్పుడు పరిష్కరించాలని తెలిపారు. చేసిన పనిని ప్రజలకు చెప్పడం ముఖ్యమని.. భవిష్యత్తులో ఏం చేస్తామో కూడా ప్రజలకు స్పష్టంగా వివరించాలని చంద్రబాబు అన్నారు.
కేంద్రంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తోందని సీఎం చంద్రబాబు అన్నారు. అందులో భాగంగానే బడ్జెట్లో పోలవరం ప్రాజెక్టుకు రూ.15వేల నిధులు కేటాయించారని తెలిపారు. పోలవంతో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాజెక్టులకు కేంద్రం నిధులు కేటాయించిందని తెలిపారు. ఈ క్రమంలోనే ఏడాదిన్నరలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. 2027 లోగానే ప్రాజెక్టును పూర్తిచేసి జాతికి అంకితం చేస్తామని తెలిపారు. స్టీల్ప్లాంట్కు కూడా కేంద్రం రూ.11,400 కోట్లు మంజూరు చేసిందని చంద్రబాబు తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.