Khammam Devarapalli National Highway 365BG: తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభవార్త.. మరో నేషనల్ హైవే ప్రజలకు అందుబాటులోకి వస్తోంది. దేవరపల్లి-ఖమ్మం జాతీయ రహదారి నిర్మాణం చివరి దశకు చేరుకుంది. ఈ నూతన హైవే అందుబాటులోకి వస్తే హైదరాబాద్ నుండి విశాఖపట్నం మధ్య ప్రయాణ సమయం రెండు గంటలు తగ్గుతుంది. ప్రయాణించిన దూరం మేరకే టోల్ ఛార్జీ వసూలు చేసే విధానంతో ఈ ఏడాది చివరి నాటికి రహదారిని అందుబాటులోకి తీసుకురానున్నారు. ఆటోలు, బైక్లకు అనుమతి లేదు.
హైలైట్:
- తెలుగు రాష్ట్రాల మధ్య మరో కొత్త హైవే
- టోల్ ఫీజులపై కీలకమైన నిర్ణయం
- ఎంత దూరం ప్రయాణిస్తే అంతే టోల్

ఈ నేషనల్ హైవే ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా, ఏలూరు జిల్లా.. తెలంగాణలోని ఖమ్మం మీదుగా 162.10 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్నారు. అలాగే ఈ హైవే ఆంధ్రప్రదేశ్లో 56.88 కిలోమీటర్లు.. తెలంగాణలో 105.22 కిలోమీటర్లు ఉంది. ఈ హైవేకు సంబంధించి ఏపీలో ఉన్న నాలుగో ప్యాకేజీలో 98శాతం, ఐదో ప్యాకేజీలో 84శాతం పనుల్ని పూర్తి చేశారు అధికారులు. తెలంగాణలో మాత్రం 80% పనులు పూర్తయ్యాయి. తెలంగాణలోని ఖమ్మం దగ్గర ఉన్న మున్నేరు వాగుపై బ్రిడ్జి నిర్మాణం పనులు పూర్తి చేసేందుకు ఆరు నెలల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. ఏపీలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ లైన్ల విషయంలో ఇబ్బందులతో పనుల్లో జాప్యం జరుగుతోంది.
ఏపీలో కొత్త నేషనల్ హైవే నాలుగు లైన్లుగా.. ఈ రూట్లో విశాఖపట్నం త్వరగా వెళ్లొచ్చు, టోల్ ఫీజ్పై కీలక నిర్ణయం
అలాగే ఈ హైవేకు సంబంధించిన భూసేకరణ వ్యవహారం కోర్టులకు చేరడంతో అలా కూడా ఆలస్యమైంది. ఆ భూముల వ్యవహారంలో కూడా కోర్టులో కేసులు ఓ కొలిక్కి రాడంతో మిగిలిన పనుల్ని త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఈ ఏడాది చివరినాటికి ఈ హైవే అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ నేషనల్ హైవేపై వాహనాలు గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వెళ్లొచ్చు. అంతేకాదు ఈ హైవేలోకి ఆటోలు, ట్రాక్టర్లు, బైక్లకు ఎంట్రీ లేదు.. వీరు పాత హైవే మీదుగా వెళ్లొచ్చు. కేవలం లారీలు, బస్సులు, కార్లు, ఇతర భారీ వాహనాలకు మాత్రం ఎంట్రీ ఉంటుంది.