శ్రీవారి దర్శనానికి వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగి ముగ్గురు భక్తులు మృతి చెందిన ఘటన అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే… కర్ణాటక రాష్ట్రం బాగేపల్లి ప్రాంతానికి చెందిన కొంతమంది ఓ టెంపు వాహనంలో తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు. స్వామివారిని దర్శనం తర్వాత వీరంతా తిరిగి వారు వచ్చిన వాహనంలోనే తమ స్వస్థలానికి బయల్దేరారు. ఈ క్రమంలో వారు ప్రయాణిస్తున్న వాహనం కురబలకోట మండలం, చెన్నామర్రి మిట్ట వద్దకు రాగానే అటుగా వేగంగా వచ్చిన ఓ లారీ భక్తులు ప్రయాణిస్తున్న వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. లారీ బలంగా ఢీకొట్టడంతో భక్తుల వాహనం నుజ్జునుజ్జు అయిపోయింది.
ఈ ప్రమాదంలో స్పాల్లోనే ముగ్గురు భక్తులు చనిపోగా.. మరో 11 మంది భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. చనిపోయిన వారి మృతదేహాలతో పాటు, గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వీరంగా చికిత్స పొందుతున్నారు.
కాగా పోలీసులు మృతుల కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. ఇక ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. లారీ డ్రైవర్ కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.