కర్ణాటకలో మరోసారి సీఎం మార్పు అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.. ప్రస్తుత డిప్యూటీ సీఎం డీకే శివకుమార్కు సీఎం పదవి దక్కుతుందంటూ కొంతకాలంగా ఆ రాష్ట్ర రాజకీయవర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే.. తాజాగా కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్ ఇదే విషయాన్ని తెరపైకి తీసుకురావండం రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా.. దేశవ్యాప్తంగా కర్ణాటక సీఎం కూర్చి వార్తల్లో నిలిచింది. మరో రెండు, మూడు నెలల్లో డీకే శివకుమార్ కర్నాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించే అవకాశముందంటూ బాంబు పేల్చారు.. అంతేకాకుండా రాష్ట్రంలోని పలువురు కాంగ్రెస్ నేతలు ఈ అంశాన్ని ప్రస్తావిస్తుండటం ఆసక్తిరేపింది. దీంతో కర్నాటకలో మళ్లీ సీఎం మార్పుపై ఊహాగానాలు జోరందుకున్నాయి.. సిద్ధరామయ్యను దించి డీకే శివకుమార్ కు సీఎం బాధ్యతలు అప్పజెబుతారంటూ వార్తా కథనాలు వెలువడ్డాయి..
కర్ణాటక సీఎం మార్పుపై వార్తల మధ్య.. కాంగ్రెస్ సీనియర్ నేత సోమవారం కీలక ప్రకటన చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య తన ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేస్తారని దీనిపై అనవసరమైన ప్రచారం వద్దంటూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఆర్వి దేశ్పాండే సోమవారం అన్నారు. కర్ణాటక సీఎం మార్పు, నాయకత్వ పునర్నిర్మాణం మధ్య ఈ ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి – ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ మధ్య ఏర్పడిన విభేదాల గురించి కాంగ్రెస్ అధిష్టానం చూసుకుంటుందని.. అయినా.. వారి మధ్య సఖ్యత ఉందంటూ పేర్కొన్నారు.
“అవును, సిద్ధరామయ్య పూర్తి ఐదేళ్ల పదవీకాలం ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. మార్పు గురించి ఎటువంటి ప్రతిపాదన లేదా చర్చ లేదు.. ఈ అంశం శాసనసభా పక్ష సమావేశంలో ప్రస్తావనకు రాలేదు.. దాని గురించి ఎవరూ నాతో మాట్లాడలేదు. మేమందరం ఐక్యంగా కలిసి బాగా పనిచేస్తున్నాము.” – అంటూ ఆర్వి దేశ్పాండే పేర్కొన్నారు.
2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి పదవిపై రాష్ట్ర కాంగ్రెస్లో తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది. సిద్ధరామయ్య, డీకే శివకుమార్లు రెండున్నరేళ్ల పాటు పదవిలో కొనసాగేలా అంగీకారానికి వచ్చారనే ప్రచారం జరిగింది. తాను ఎప్పటికైనా ముఖ్యమంత్రి పదవిని స్వీకరిస్తానని శివకుమార్ కూడా బహిరంగంగానే చెబుతున్నారు. లేటెస్ట్గా రాష్ట్రంలోని పలువురు కాంగ్రెస్ నేతలు ఈ అంశాన్ని ప్రస్తావిస్తుండటం ఆసక్తిరేపుతోంది. ఈ విషయంపై ఇప్పటికే పలుమార్లు సీఎం సిద్ధరామయ్య స్పందించారు. నాయకత్వ మార్పు అనేది అధిష్ఠానం పరిధిలో ఉందన్నారు. దీనిపై తాను బహిరంగంగా ఏమీ మాట్లాడబోనంటూ అప్పట్లో ప్రకటించారు.. తాజా చర్చ నేపథ్యంలో సీఎం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.