ప్రధాని నరేంద్ర మోదీ విదేశీపర్యటనకు బయల్దేరారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఎనిమిది రోజుల పాటు ఐదు దేశాల్లో పర్యటించనున్నారు. ఐదు దేశాల ప్యటనలో భాగంగా ప్రధాని మోదీ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాల్లో కూడా పాల్గొననున్నారు. ఈ సమావేశానికి మొత్తం 10 దేశాల అధినేతలు హాజరుకానున్నారు. ఇక ఈ సమావేశంలో పాల్గొనేందుకు బ్రెజిల్ వెళ్తున్న ప్రధాని..గ్లోబల్ సౌత్లోని పలు కీలక దేశాలతో భారత్ సంబంధాలను విస్తరించడమే లక్ష్యంగా తన పర్యటన కొనసాగించనున్నారు. ఈ నెల 9 వరకు కొనసాగే ఈ పర్యటనలో ప్రధాని రెండు ఖండాలను కవర్ చేయనున్నారు. మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒకేసారి ఐదు దేశాల్లో పర్యటించడం ఇది రెండోసారి.
ఇక పర్యటనలో భాగంగా జూలై 2-3 తేదీల్లో పశ్చిమ ఆఫ్రికాలోని ఘనా నుండి ఐదు దేశాల పర్యటనను మోదీ ప్రారంభిస్తారు. ఘనాకు మోదీ తొలి ద్వైపాక్షిక పర్యటన ఇది, మూడు దశాబ్దాల తర్వాత భారత ప్రధాని ఘనా పర్యటన వెళ్తున్నారు. ఈ సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడితో ప్రధాని మోదీ ద్వైపాక్షిక సంబంధాలతో పాటు ఆర్థిక, ఇంధన, రక్షణ సహకారంపై భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు ఉన్న అవకాశాలపై చర్చించనున్నరు. ఈ చర్చల తర్వాత ఆదేశ పార్లమెంట్ను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించనున్నారు.
తర్వాత మోదీ జూలై 3-4 తేదీలలో కరేబియన్లోని ట్రినిడాడ్ & టొబాగో దేశంలో ఆయన పర్యటించనున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షురాలు క్రిస్టీన్ కార్లా కంగలూ, ప్రధాన మంత్రి కమలా పెర్సాద్-బిస్సేసర్తో మోదీ చర్చలు జరపనున్నారు. భారతదేశం-ట్రినిడాడ్ సంబంధాలను బలోపేతం చేయడంపై మోదీ చర్చిస్తారు. ఈ చర్చల తర్వాత ఆదేశ పార్లమెంట్ సంయుక్త సమావేశంలో కూడా ప్రధాని ప్రసంగిస్తారు.
ఇక జూలై 4-5 తేదీలలో ప్రధాని మోదీ అర్జెంటీనాలో పర్యటించనున్నారు. ఆ దేశ అధ్యక్షుడు జేవియర్ మిలే ఆహ్వానం మేరకు ప్రధాని ఈ పర్యటనకు వెళ్లనున్నారు. రక్షణ, వ్యవసాయం, మైనింగ్, చమురు, గ్యాస్, పునరుత్పాదక ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడి, ప్రజల మధ్య సంబంధాలు వంటి కీలక రంగాలలో భారతదేశం-అర్జెంటీనా భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించే అంశాలపై ఆయనతో ప్రధాని మోదీ చర్చించనున్నారు.
ఇక జూలై 5-8 తేదీలలో ప్రధాని బ్రిజిల్లో పర్యటించనున్నారు. అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డ సిల్వా ఆహ్వానం మేరకు మోడీ బ్రెజిల్కు వెళ్లి రియోలో జరిగే 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి పాల్గొననున్నారు. ఆ తర్వాత రాజధాని బ్రెసిలియాలో ప్రధాని పర్యటించనున్నారు. బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో భాగంగా పలు దేశాల అధినేతలతో ప్రధాని మోదీ అనేక ద్వైపాక్షిక సమావేశాలను నిర్వహించే అవకాశం ఉంది.
ఇక చివరి దశలో, అధ్యక్షుడు నేతుంబో నంది-న్దైత్వా ఆహ్వానం మేరకు జూలై 9న ప్రధాని ఆఫ్రికన్ దేశమైన నమీబియానలో పర్యటించనున్నారు. ఈ దేశంలో ప్రధాని మోదీ పర్యటించడం ఇదే మొదటి సారి. అధ్యక్షుడు నంది-న్దైత్వాతో చర్చలు జరపడంతో పాటు, ప్రధాని నమీబియా వ్యవస్థాపక పితామహుడు, సామ్ నుజోమాకు మోదీ నివాళులర్పించనున్నారు. ఆ తర్వాత నమీబియా పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.