ఆ రోజు కలెక్టరేట్లో గ్రీవెన్స్ డే.. ఈ సందర్భంగా అనేక మంది తమ ఫిర్యాదులతో కలెక్టరేట్కు క్యూ కట్టారు. మీడియా ప్రతినిధులు ఫిర్యాదుదారుల నుంచి వారి సమస్యలపై మాట్లాడుతున్నారు. అదే సమయంలో వీపునకు స్కూల్ బ్యాగ్ తగిలించుకొని ఒక ఎనిమిదేళ్ల బాలుడు కలెక్టరేట్లోకి వచ్చాడు. అటు ఇటు తిరుగుతున్నాడు. మొదట ఎవరూ పట్టించుకోలేదు. ఆ తర్వాత బాలుడిని చూసిన ఓ మీడియా ప్రతినిది ఎం కావాలి బాబు ఎందుకొచ్చావంటూ ప్రశ్నించారు. కలెక్టర్ను కలవలంటూ ఆ బాలుడు చెప్పాడు. వెంటనే ఆ బాలుడిని తీసుకొని మీడియా ప్రతినిధులు గ్రీవెన్స్ హాల్లోకి వెళ్ళారు.
గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి కూడా బాబును దగ్గరకు తీసుకొని ఎందుకొచ్చావంటూ ప్రశ్నించారు. మా అమ్మ టిఫిన్ బండిని రోడ్డు విస్తరణలో భాగంగా తొలగించారు. తిరిగి పెట్టడానికి అధికారులు ఒప్పుకోవటం లేదు. నాకు గుండెకు సంబంధించిన వ్యాధి ఉంది. పెద్ద అయిన తర్వాత ఆపరేషన్ చేస్తామన్నారు. అందుకే అమ్మ టిఫిన్ బండి పెట్టుకొని కష్టపడుతుంది అని చెప్పాడు. అంతే కాకుండా తన తండ్రి లారీ డ్రైవర్ గా పని చేస్తుంటాడని కూడా తెలిపాడు. అయితే అధికారులు బండి పెట్టనివ్వకపోవడంతో అమ్మ చనిపోదామంటుందని తనకు భయం వేసి కలెక్టరేట్ వచ్చానని చెప్పుకొచ్చాడు.
అయితే బాలుడు తమ ధైర్యంగా సమస్య చెప్పడంతో పాటు గతంలో తమ సమస్యపై స్థానిక ఎమ్మెల్యేకు రాసిన అర్జీని కూడా కలెక్టర్కు చూపించాడు. బాలుడు యశ్వంత్ చెప్పినదంతా విన్న కలెక్టర్ నాగలక్ష్మి. వెంటనే అధికారులకు ఆదేశాలిచ్చారు. బండి పెట్టుకొనే అవకాశం కల్పించాలని సిబ్బందికి తెలిపారు.
వీడియో చూడండి..
కలెక్టర్ ఆదేశాలతో కార్పోరేషన్ కమీషనర్ పులి శ్రీనివాస్ సాయంత్రానికి జిజిహెచ్ వద్ద టిఫిన్ బండి పెట్టుకునేలా యశ్వంత్ కుటుంబానికి వెసులుబాటు కల్పించారు. దీంతో తల్లి కొడుకు ఇద్దరూ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. కాగా తమ సమస్య పరిష్కారం కోసం బాలుడు చూపించిన ధైర్యాన్ని కలెక్టర్ సహా అధికారులు అందరూ కొనియాడారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.