తన తల్లి బ్యాంక్ అకౌంట్లో జమ చేసుకున్న డబ్బులు తనకు ఇవ్వడం లేదనే అక్కసుతో ఓ కసాయి కొడుకు మానవ మృగంలా ప్రవర్తించాడు. కన్నతల్లిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు. ఒళ్ళంతా కాలిన గాయాలతో మూడు రోజులపాటు మృత్యువుతో పోరాడిన ఆ తల్లి చివరకు ప్రాణాలు కోల్పోయింది. ఈ హృదయవిదారక ఘటన వరంగల్ జిల్లాలో వెలుగు చూసింది. వివరాళ్లోకి వెళితే.. సంగెం మండలం కుంటపల్లి గ్రామానికి చెందిన వినోద – సాంబయ్య దంపతుల సతీష్ అనే కుమారుడు ఉన్నారు. సతీష్కు తల్లిదండ్రులు ఇటీవలే పెళ్లి కూడా చేశారు. అయితే ఈ మధ్య కాలంలో తల్లి అకౌంట్లో రూ.5లక్షలు ఉన్నట్టు గుర్తించిన సతీష్.. అప్పటి నుంచి ఆమెను డబ్బుల కోసం వేధించడం మొదలుపెట్టాడు. కొడుకుకు డబ్బులు ఇచ్చేందుకు తల్లి నిరాకరించడంతో.. ఈ గొడవ కాస్తా పెద్దల పంచాయతీ వరకు వెళ్లింది. ఈ క్రమంలో తల్లిదండ్రులు, సతీస్, అతని భార్యను పలిపించి మాట్లాడిన పెద్దలు.. రెండు కుటుంబాలు వేరువేరుగా ఉండాలని నిర్ణయించారు.
ఈ క్రమంలో సతీష్ తన కుటుంబంతో కలిసి గీసుకొండ మండలం గంగదేవిపల్లిలో ఉంటున్నాడు. అతని తల్లిదండ్రులు తమ స్వగ్రామంలోనే ఉంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే అడిగిన డబ్బులు ఇవ్వకపోగా.. తనను ఇంట్లో నుంచి బయటకు పంపించేలా చేసిందని.. తల్లిపై కోపం పెంచుకున్న కొడుకు సతీష్ ఆమెపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 28 రాత్రి తల్లి ఇంటికి వెళ్లి.. ఇంటికి ముందు నిద్రిస్తున్న తల్లి వినోదపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో తల్లి వినోద కేకలు వేయడంతో అప్రమత్తమైన స్థానికులు వెంటనే ఆమెకు అంటుకున్న మంటలను చల్లార్చారు.
అయితే, వాళ్లు మంటలు ఆర్పేలోపే వినోద శరీరం సుమారు 85శాతం కాలిపోయింది. దీంతో స్థానికులు వెంటనే ఆమెను ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు అత్యవసర చికిత్స అవసరమని వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. ఇక మూడు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన వినోద చివరకు సోమవారం తనువు చాలించింది. తండ్రి ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు సతీష్ను అదుపులోకి తీసుకున్నారు. డబ్బుల కోసమే అతికిరాతకంగా తల్లిపై పెట్రోల్పోసి హత్య చేసినట్టు నిర్థారించిన పోలీసులు సతీష్ను రిమాండ్కు తరలించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.