Ysrcp On Cockroach In Vangalapudi Anitha Plate: ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత పాయకరావుపేటలోని బీసీ బాలికల హాస్టల్ను తనిఖీ చేశారు. భోజనం రుచి చూస్తున్న సమయంలో తన ప్లేట్లో బొద్దింక వచ్చిందంటూ జరుగుతున్న ప్రచారంపై ఆమె స్పందించారు. అది వెంట్రుక అని, ప్రతిపక్షాలు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, వైఎస్సార్సీపీ మాత్రం అది బొద్దింక అని వాదిస్తోంది. హాస్టల్లో సన్న బియ్యం పెట్టడం లేదని, మెనూ పాటించడం లేదని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

పాయకరావుపేట హాస్టల్ను ఆకస్మికంగా తనిఖీ చేశానని మంత్రి అనితి తెలిపారు. అక్కడ మెనూ పాటించలేదన్నారు. వార్డెన్ అందుబాటులో లేరని.. సెక్యూరిటీ కూడా లేరని.. అందుకే వార్డెన్ను సస్పెండ్ చేశామని తెలిపారు. అన్ని హాస్టల్స్ను తనిఖీలు చేయమని అధికారులను ఆదేశించామన్నారు. అయితే.. భోజనంలో చిన్న తల వెంట్రుక కనిపించిందని… దానిని బొద్దింక అని ప్రచారం చేస్తున్నారని మంత్రి క్లారిటీ ఇచ్చారు. శ్రీశైలం ప్రసాదంలో కూడా బొద్దింక వచ్చిందని ప్రచారం చేశారని.. ఏదో రకంగా ప్రభుత్వంపై బురద జల్లాలని చూస్తున్నారని ప్రతిపక్షంపై మంత్రి అనిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయితే తాజాగా వైఎస్సార్సీపీ ఈ బొద్దింక ఎపిసోడ్పై స్పందించింది. ‘నిజం నిప్పులాంటిది.. పాపం చిన్నపిల్లలతో అబద్ధాలు ఎందుకు చెప్పిస్తున్నారు అంటూ తెలుగు దేశం పార్టీ, మంత్రి నారా లోకేష్ను ట్యాగ్ చేశారు. హోంమంత్రి అనిత బీసీ హాస్టల్ లో తినేటప్పుడు ప్లేట్ లో బొద్దింక వచ్చిన మాట వాస్తవం కాదా? రాష్ట్రంలో పిల్లలకి సన్న బియ్యంతో భోజనం పెట్టట్లేదని చెప్పిన మాట వాస్తవం కాదా? మధ్యాహ్న భోజన పథకాన్ని మీ కూటమి ప్రభుత్వం వచ్చాక భ్రష్టు పట్టించడమే కాకుండా.. సాక్ష్యాత్తు మీరు తింటున్నప్పుడే పరిస్థితి ఇలా ఉంటే ఇక మిగతా రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటదో అర్థం చేసుకోలేని అమాయకులు ఎవరూ లేరు’ అంటూ ట్వీట్ చేశారు. హోంమంత్రి అనిత భోజనం చేసే సమయంలో వచ్చింది వెంట్రుక కాదు బొద్దింక అంటోంది వైఎస్సార్సీపీ.
హోంమంత్రి అనిత అనకాపల్లిలోని పాయకరావుపేట బీసీ బాలికల కాలేజ్ హాస్టల్ను తనిఖీ చేశారు. ఆమె వెళ్లిన సమయంలో హాస్టల్లో వార్డెన్ అందుబాటులో లేకపోవడంతో అక్కడ విద్యార్థినిలతో కూర్చొని మాట్లాడారు. నేలపైనే బాలికలతో కూర్చొని.. వాళ్లకున్న ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. ఆడపిల్లలు ధైర్యంగా ఉండాలని, సామాజిక మాధ్యమాలపై అప్రమత్తంగా ఉండాలని విద్యార్థులకు అనిత కొన్ని సూచనలు చేశారు. అయితే వార్డెన్ రాకపోవటంతో.. సిబ్బందిని భోజనానికి ఏర్పాట్లు చేయాలని చెప్పారు. విద్యార్థులకు అందించే భోజనాన్ని పరిశీలించిన మంత్రి అనిత.. ప్రభుత్వం ఇచ్చిన మెనూ పాటించకపోవటంపై సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను వచ్చి అరగంట దాటినా వార్డెన్ మాత్రం లేదని.. సీసీ కెమెరాలు కూడా లేవని.. మెనూ పాటించట్లేదని మండిపడ్డారు. వార్డెన్ మీద క్షమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వెంటనే సీసీ కెమెరాలు పెట్టించాలన్నారు. హాస్టల్పై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలన్నారు.
హోంమంత్రి అనిత కూడా పిల్లలతో కలిసి వాళ్లకు పెట్టే భోజనాన్ని తాను ఓ ప్లేట్లో పెట్టుకుని.. వాళ్లతో పాటే నేలపై కూర్చున్నారు. హాస్టల్ పిల్లలకు సన్నబియ్యం పెట్టాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిందని.. ఎందుకు పెట్టట్లేదని సిబ్బందిని ప్రశ్నించారు. అయితే అనిత ఆ అన్నాన్ని నోట్లో పెట్టుకుందామని కలుపుతుంటే.. ఊహించని అనుభవం ఎదురైంది. ప్లేట్లో వెంట్రుక కనిపించింది. అప్పటికే చాలా సీరీయస్ అయిన మంత్రి.. తన భోజనంలోనే వెంట్రుక కనిపించేసరికి.. ఎవరిని ఏమనాలో తెలియక నవ్వుకున్నారు. మంత్రిని చూసి.. పిల్లలంతా కూడా ఒక్కసారిగా గొల్లుమన్నారు. అయితే హోంమంత్రి ప్లేటులోది వెంట్రుక కాదు బొద్దింక అంటోంది వైఎస్సార్సీపీ. అనిత మాత్రం అది వెంట్రుక అని క్లారిటీ ఇచ్చారు.