AP Govt Employees Free Accommodation Extended: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు ఉచిత బస సౌకర్యాన్ని మరో ఏడాది పొడిగించింది. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ స్పోక్ సెంటర్ల ఏర్పాటుకు జిల్లాల జేసీలను ప్రభుత్వం నామినేట్ చేసింది. పాఠశాలల్లో విద్యార్థుల కోసం సంసిద్ధత కార్యక్రమాన్ని నిర్వహించాలని విద్యాశాఖ ఆదేశించింది. విశాఖపట్నంలో కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్కు భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయాల ద్వారా ఉద్యోగులకు, విద్యార్థులకు, పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది.

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అనంతపురం, తిరుపతి, విజయవాడ, రాజమహేంద్రవరం, విశాఖపట్నంలో ఏర్పాటు చేయనున్న రతన్టాటా ఇన్నోవేషన్ హబ్ (ఆర్టీఐహెచ్) స్పోక్ సెంటర్లకు సంబంధించి.. ఏపీ ప్రభుత్వం తరఫున నామినీ అధికారుల్ని నామినేట్ చేశారు. ఈ మేరకు ఆయా సంబంధిత జిల్లాల జేసీలను నామినేట్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే గుంటూరు జిల్లా జేసీ అమరావతిలో ఏర్పాటు చేసే మెయిన్ హబ్కు నామినేటెడ్ అధికారిగా వ్యవహరిస్తారని ప్రభుత్వం తెలిపింది. ఆయా జిల్లాల్లో ఏర్పాటు చేయనున్న హబ్లు.. ప్రధాన హబ్కు అనుసంధానంగా పనిచేస్తాయి అన్నారు. ఈ మేరకు జేసీలు భాగస్వామ్య పక్షాలను సమన్వయం చేస్తారని ప్రభుత్వం తెలియజేసింది. ఈ హబ్లకు అవసరమైన మౌలిక సదుపాయాలతో పాటుగా నిర్వహణను జేసీలు పర్యవేక్షించనున్నారు.
ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో సంసిద్ధత (రెడీనెస్) కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. చదివే 1 నుంచి 6 తరగతుల విద్యార్థుల కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని పాఠశాల విద్యా శాఖ ఆదేశాలు జారీ చేసింది. క్లాస్ మారడం, ఫౌండేషన్ లెవల్ నుంచి విద్య నేర్పించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ‘ ఒకటి, రెండు తరగతులకు 45, మూడు నుంచి ఐదు తరగతులకు 30, ఆరో తరగతి విద్యార్థులకు 40 రోజుల పాటు ప్రత్యేకంగా రూపొందించిన సిలబస్ను బోధన. ఒకటి, రెండు తరగతులకు తెలుగు, గణితం, ఆంగ్లంతోపాటు రంగులు గుర్తించడం, శబ్దాలు విని స్పందించడం లాంటివి.. 3 నుంచి 6 తరగతులకు తెలుగు, గణితం, ఆంగ్లం, ఈవీఎస్ను బోధిస్తారు’ అని తెలిపారు అధికారులు.
ఏపీ ప్రభుత్వం విశాఖపట్నంలో ఏర్పాటు చేయనున్న కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కు భూమిని కేటాయించారు. నగరంలోని మధురవాడలో 22.19 ఎకరాలను.. 99 పైసలకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2028 జూన్ కల్లా మొదటి దశ ప్రాజెక్టు పనులను పూర్తి చేసేందుకు కాగ్నిజెంట్ అంగీకరించింది. ‘2026 జూన్ నాటికి లీజు విధానంలో ఏర్పాటు చేసే క్యాంపస్లో 500 మందికి ఉపాధి కల్పిస్తారు. ఏపీ ఐటీ పాలసీ 4.0 నిబంధనల మేరకు ప్రోత్సాహకాలను అందించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. విశాఖలో రూ.1,582.98 కోట్ల పెట్టుబడి పెట్టి… 8 వేల మందికి ఉపాధి కల్పించేందుకు కాగ్నిజెంట్ సుముఖత వ్యక్తంచేసింది’ అని ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది.