Anakapalli Fisherman Dragged By Fish,విశాఖ: మత్స్యకారుడిని లాక్కెళ్లిన చేప.. సముద్రంలో గల్లంతు, బాబోయ్ ఆ చేప అంత డేంజరా! – kommu konam fish dragged fisherman in anakapalli district
Anakapalli Fish Dragged Fisherman In Sea: విశాఖ, అనకాపల్లి తీరంలో విషాదం చోటుచేసుకుంది. పూడిమడకకు చెందిన యర్రయ్య అనే మత్స్యకారుడు సముద్రంలో చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు గల్లంతయ్యాడు. ఈ క్రమంలో గాలానికి చిక్కిన భారీ కొమ్ముకోనాం చేపను లాగే ప్రయత్నంలో అదుపుతప్పి నీటిలో పడిపోయాడు. అయితే తోటి మత్స్యకారులు వెతికినా ఫలితం లేకపోయింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. అసలేం జరిగిందనేది మిస్టరీగా మారింది.
విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో విశాలమైన సాగరతీరం ఉంది.. అక్కడి ప్రజలకు సముద్రమే జీవనాధారం. మత్స్యకారులు చేపల వేటతో వారి కుటంబాలను పోషించుకుంటున్నారు. అప్పుడప్పుడు తుఫాన్లు, అల్పపీడనాలు, ద్రోణుల ప్రభావంతో, ఈదురు గాలుల దెబ్బకు సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది.. కొన్ని సందర్భాల్లో పడవలు సముద్రంలో మునిగి మత్స్యకారులు ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే ఓ మత్స్యకారుడ్ని చేప లాక్కెళ్లిన ఘటన కలకలం రేపింది.. వినడానికి కాస్త విచిత్రంగా ఉన్న ఘటన అనకాపల్లి జిల్లాలో జరిగింది. సముద్రంలో చేపలవేటకు వెళ్లి.. పెద్ద చేప వలకు చిక్కిందిలే అనుకుని సంబరపడగా.. ఆ చేపను చేజిక్కించుకునే ప్రయత్నంలో యువకుడు సముద్రంలో మునిగి గల్లంతయ్యారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడకకు చెందిన చోడపల్లి యర్రయ్య అనే యువకుడు తన తమ్ముడు కొర్లయ్య, గనగళ్ల అప్పలరాజు, వాసుపల్లి యల్లాజి అనే మరో ముగ్గురితో కలిసి బుధవారం తెల్లవారుజామున చేపల వేటకు వెళ్లారు. సముద్ర తీరం నుంచి 30 కిలో మీటర్ల దూరం వెళ్లాక చేపల వేట మొదలు పెట్టారు. వీరు చేపల కోసం గాలం వేయగా.. కొమ్ముకోనాం చేప చిక్కింది.. దీని బరువు 100 కిలోల వరకు ఉంటుంది. పెద్ద చేప చిక్కిందిలే అని సంతోపడ్డారు.. యర్రయ్య తాడుతో ఆ చేపను లాగేందుకు ప్రయత్నించాడు. అయితే ఆ చేప బలం ముందు యర్రయ్య తట్టుకోలేకపోయాడు. ఈ క్రమంలో యర్రయ్యను చేప బలంగా సముద్రంలోకి లాగేసింది. పడవలో నుంచి యర్రయ్య నీళ్లలోకి పడిపోయాడు.
Vizag Court: విశాఖ కోర్టు సంచలన తీర్పు.. ఆరుగురిని చంపిన కేసులో ఉరిశిక్ష
తమ్ముడు, తోటి మత్స్యకారుల కళ్లముందే యర్రయ్య సముద్రంలో గల్లంతయ్యాడు. వెంటనే యర్రయ్య తమ్ముడు కొర్లయ్య ఈ సమాచారాన్ని స్థానికులకు చేరవేశాడు. వెంటనే స్థానిక మత్స్యకారులు కొందరు పడవల సాయంతో యర్రయ్య గల్లంతైన చోట సముద్రంలో వెతికినా లాభం లేకుండా పోయింది.. అతడి ఆచూకీ దొరకలేదు. యర్రయ్య గల్లంతు కావడంతో కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.. పూడిమడకలో విషాద చాయలు అలముకున్నాయి.. తల్లి కన్నీటిపర్యంతం అయ్యారు. అయితే మత్స్యకారుడ్ని చేప లాక్కెళ్లడం కలకలం రేపింది.
రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి