ఏపీలో కొత్త ఎయిర్పోర్టుల నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. కొత్తగా నాలుగు ప్రాంతాల్లో ఎయిర్పోర్టులు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే నాగార్జునసాగర్ ఎయిర్పోర్టు అంశంలో కీలక అప్డేట్ వచ్చింది. నాగార్జునసాగర్ ఎయిర్పోర్టుకు సంబంధించిన సాంకేతిక, ఆర్థిక అంశాలను పరిశీలించి.. టెక్నికల్ అండ్ ఎకనమిక్ ఫీజబులిటీ రిపోర్టు తయారీకి ఆంధ్రప్రదేశ్ విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ బిడ్లను ఆహ్వానిస్తోంది.

ఇక బిడ్డింగ్లో బిడ్ దక్కించుకున్న కంపెనీ.. నాగార్జునసాగర్ ఎయిర్పోర్టు ఏర్పాటుపై సాంకేతిక, ఆర్థిక అంశాల సాధ్యాసాధ్యాలను పరిశీలించనుంది. క్షేత్రస్థాయిలో పర్యటించి, సర్వే చేసి వివరాలు సేకరించనుంది. అనంతరం ఈ నివేదికను ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్టు డెవలప్మెంట్ అథారిటీకి అందజేయనుంది. ఈ నివేదిక ఆధారంగా నాగార్జునసాగర్ ఎయిర్పోర్టుకు ఎన్ని ఎకరాల భూమి అవసరం అవుతుంది, ఎంత మేరకు ఖర్చు చేయాల్సి ఉంటుందనే దానిపై అధికారులు ఓ క్లారిటీ రానున్నారు. ఆ మేరకు ప్రణాళికలు రూపొందిస్తారు.
మరోవైపు నాగార్జునసాగర్ వద్ద ఇప్పటికే ఎయిర్డ్రోమ్ ఉంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణం సమయంలో అప్పటి ప్రధానులు జవహర్లాల్ నెహ్రూ, ఇందిరా గాందీ రావటం కోసం ఈ ఎయిర్డ్రోమ్ నిర్మించారు. అయితే నాగార్జునసాగర్ ప్రాజెక్టు ప్రారంభించిన తర్వాత ఈ ఎయిర్డ్రోమ్ నిర్వహణను పట్టించుకోలేదు. అయితే 2010లో ఓ ప్రైవేట్ సంస్థ దీనిని లీజుకు తీసుకుంది. పైలెట్ ట్రైనింగ్ కోసం నాగార్జునసాగర్ ఎయిర్డ్రోమ్ను ప్రభుత్వం నుంచి లీజుకు తీసుకుంది. అయితే ఏపీని లాజిస్టిక్ హబ్గా మార్చాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో మరో ఏడు కొత్త ఎయిర్పోర్టులు ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం సంకల్పించింది. అందులో భాగంగా నాగార్జునసాగర్ ఎయిర్పోర్టును విస్తరించాలని ప్రణాళికలు రచించారు.
నాగార్జునసాగర్ ఎయిర్పోర్టు నిర్మాణం పూర్తి అయ్యి.. అందుబాటులోకి వస్తే ఈ ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. అలాగే పల్నాడు జిల్లా రూపురేఖలు కూడా మారిపోతాయ్. ఇక్కడి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కుతాయని అధికారులు చెప్తున్నారు.