ఏపీలో రప్పా రప్పా రాజకీయం రంజుగా నడుస్తోంది. పోలీసు కేసుల వరకు వెళ్లింది. వైసీపీ నాయకులు, మాజీ మంత్రి పేర్ని నానిపై మచిలీపట్నంలో కేసు నమోదైంది. ఆర్.పేట పీఎస్ జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. పామర్రు మీటింగ్లో అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణలో కేసు నమోదు చేశారు. శనివారం పార్టీ కార్యకర్తల సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీమంత్రి పేర్ని నాని. రప్పారప్పా ఓల్డ్ డైలాగ్ అని.. సైలెంట్గా నరకడమే వ్యూహమంటూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. వైసీపీ నేత పేర్ని వ్యాఖ్యలతో ఆ పార్టీ విధానం తేటతెల్లం అయిందన్నారు టీడీపీ నేతలు. హింస, విధ్వంసం వైపీపీ విధానమని చెప్పకనే చెప్పారన్నారు టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్.
కృష్ణా జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ హారికపై టీడీపీ గూండాలు దాడి చేశారంటూ పేర్నినాని తీవ్రంగా విమర్శించారు. హత్యాయత్నం చేస్తున్నా పోలీసులు చూస్తూ ఉండిపోయారని ఆరోపణలు గుప్పించారు. టీడీపీ గూండాల దాడికి పోలీసులు రక్షణగా ఉన్నారన్నారు పేర్ని నాని. పోలీసుల సమక్షంలో దాడి జరిగితే ఇది సైకో పాలన కాదా? అంటూ నాని ప్రశ్నించారు. దాడి, హత్యాయత్నంపై హారిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం దాడి చేసిన వారిపై చర్యలుతీసుకుంటుందనే నమ్మకం లేదని అన్నారు.
మరోవైపు పేర్నినానిపై మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పేర్ని నాని బియ్యం దొంగ అంటూ కొల్లు మండిపడ్డారు. ప్రభుత్వంపై కావాలనే నిరాధార ఆరోపణలు చేస్తున్నారన్నారు. వైసీపీ నేతలు బరితెగించి మాట్లాడుతున్నారన్నారు. ప్రభుత్వంపై బురదజల్లుతున్న ఏ ఒక్కరినీ వదిలిపెట్టేది లేదన్నారు కొల్లు రవీంద్ర. వైసీపీ మాజీ మంత్రులపైనా కేసులు పెడతామన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. ఈ నేపథ్యంలో పేర్ని నానిపై మచిలీపట్నంలో కేసు నమోదు కావడం చర్చనీయాంశంగా మారింది.