సికింద్రాబాద్ బోనాల జాతర అట్టహాసంగా జరుగుతోంది. భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఈ సందర్భంగా ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. ముఖ్యమంత్రికి ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారికి రేవంత్ పట్టువస్త్రాలు సమర్పించారు. అమ్మవారిని దర్శించుకున్న సీఎం ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. మంత్రి కొండా సురేఖ అమ్మవారికి బోనం సమర్పించారు. ప్రజలంతా సంతోషంగా ఉండాలని ఆ తల్లిని కోరుకున్నట్లు సీఎం తెలిపారు. సీఎంతో పాటు పలువురు ప్రముఖులు అమ్మవారిని దర్శించుకున్నారు. హర్యానా గవర్నర్ బంగారు దత్తాత్రేయతోపాటు పలువురు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
లష్కర్ బోనాల సందర్భంగా ఇప్పటికే ఆలయ పరిసరాలు భక్తులతో కిటికటలాడుతున్నాయి. ఆషాడమాసంలో జరిగే బోనాల జాతరకు చాలా ప్రత్యకత ఉంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడే ఈ పండుగ సందర్భంగా జరుపుకుంటున్నారు. ఈ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయానికి 200 ఏళ్ల చరిత్ర ఉంది. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రభుత్వం ఈ జాతరను ప్రతిష్టాత్మకంగా తీసుకుని వైభవంగా నిర్వహిస్తోంది.