మానవుడి పుట్టుక కోతి నుంచే అంటారుకదా….ఇప్పుడా కోతి నుంచి వచ్చిన మహమ్మారి మానవుడి జీవితాన్ని ఆందోళనలో పడేసింది. కోతుల నుంచి మనుషులకు వ్యాపించే ఆ వైరస్.. ప్రపంచాన్ని డేంజర్ జోన్లో పడేసింది. దానిపేరే మంకీ పాక్స్ (Mpox). ఇంతకాలం అదెక్కడో ఆఫ్రికాలో పుట్టింది. ఆఫ్రికా గ్రామాల్లోనే వేళ్లూనుకుపోయింది. మనదాకా ఎందుకు వస్తుందిలే అని ఇన్నాళ్లూ తాత్సారం చేశం. కానీ అది ఆఫ్రికా ఖండం దాటుకుని.. మన ఆసియా దాకా వచ్చేసింది. అంతటితో ఆగకుండా మన దేశంలోకి కూడా అడుగుపెట్టింది. ప్రస్తుతం Mpox (మంకీపాక్స్) మహమ్మారి తీవ్రతను ఎదుర్కొంటున్న దేశం నుంచి ఇటీవలే భారత్ కు వచ్చిన ఒక యువకుడికి మంకీపాక్స్ వైరస్ లక్షణాలను గుర్తించారు. క్షణాలను బట్టి.. Mpox అనుమానిత కేసుగా గుర్తించినట్లు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది. ప్రస్తుతం రోగిని ఆసుపత్రిలో ఐసోలేషన్ లో ఉంచినట్లు ప్రభుత్వం తెలిపింది.. యువకుడి పరిస్థితి నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
రోగి నుంచి రక్త నమూనాలను సేకరించి ఎంపాక్స్ నిర్ధారణ కోసం ల్యాబ్ కు పంపించామని, ఫలితాలు రావాల్సి ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని, ఇదే సమయంలో వ్యాధి సంక్రమణ మూలాలను గుర్తించేందుకు కాంటాక్ట్ ట్రేసింగ్ కొనసాగుతోందని కేంద్రం వెల్లడించింది.. ఈ వ్యాధి తీవ్రతపై జాతీయ వ్యాధుల నియంత్రణ కేంద్రం ముందస్తుగానే అంచనాలు వేసిందని ఆందోళన చెందాల్సి అవసరం లేదని పేర్కొంది.. ఇటువంటి కేసులు వెలుగు చూసిన సందర్భంలో వాటిని సమర్థంగా ఎదుర్కొనేందుకు పూర్తి సంసిద్ధతతో ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటనలో వెల్లడించింది.
ఇదిలాఉంటే.. ప్రాణాంతక ఎంపాక్స్ వ్యాప్తి ఆఫ్రికా దేశాల్లో ఆందోళనకర రీతిలో ఉన్నట్లు పేర్కొంటున్నారు. ఇప్పటికే 18 వేల అనుమానిత కేసులు, 926 మరణాలు సంభవించాయని నివేదికలు చెబుతున్నాయి.. కొత్తరకం కేసులు ఇప్పటివరకు 258 నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.

