లండన్లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో జరుగుతున్న భారత్-ఇంగ్లాండ్ ఐదో టెస్టు రసవత్తరంగా మారింది. సిరీస్ను సమం చేయాలంటే కచ్చితంగా గెలవాల్సిన ఈ మ్యాచ్లో భారత్, ఇంగ్లాండ్కు 374 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ లక్ష్యాన్ని ఇంగ్లాండ్ చేధించగలిగితే, ఓవల్ మైదానం చరిత్రలోనే అది అత్యధిక రన్ ఛేజ్ అవుతుంది.
తొలి ఇన్నింగ్స్లో భారత్ 224 పరుగులకు ఆలౌట్ కాగా, ఇంగ్లాండ్ 247 పరుగులు చేసింది. దీంతో ఇంగ్లాండ్కు 23 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. కానీ, రెండో ఇన్నింగ్స్లో భారత బ్యాటర్లు అద్భుతమైన ప్రతిభ కనబరిచారు. ముఖ్యంగా యశస్వి జైస్వాల్ 118 పరుగుల వీరోచిత శతకంతో జట్టుకు భారీ ఆధిక్యాన్ని అందించాడు. జైస్వాల్తో పాటు ఆకాష్ దీప్ (66), రవీంద్ర జడేజా (53), వాషింగ్టన్ సుందర్ (53) కూడా హాఫ్ సెంచరీలు చేసి కీలక పాత్ర పోషించారు. ఈ నలుగురి అద్భుతమైన బ్యాటింగ్తో భారత్ రెండో ఇన్నింగ్స్లో 396 పరుగులు చేసి ఇంగ్లాండ్కు 374 పరుగుల కఠినమైన లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఓవల్ మైదానంలో నాలుగో ఇన్నింగ్స్లో అత్యధిక రన్ ఛేజ్ రికార్డు 1902లో నమోదైంది. అప్పట్లో ఇంగ్లాండ్ జట్టు ఆస్ట్రేలియా నిర్దేశించిన 263 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేసింది. అంటే, ఇంగ్లాండ్ ఇప్పుడు 374 పరుగులు ఛేజ్ చేయాలంటే 123 సంవత్సరాల రికార్డును బద్దలు కొట్టాలి. ఈ లక్ష్యాన్ని చేరుకోవడం ఇంగ్లాండ్కు అంత సులభం కాదు.
కెన్నింగ్టన్ ఓవల్ మైదానం 1877లో క్రికెట్ చరిత్రలో తొలి టెస్ట్ మ్యాచ్ జరిగిన మైదానం. అప్పటి నుంచి ఇక్కడ 100 కంటే ఎక్కువ టెస్ట్ మ్యాచ్లు జరిగాయి. అయితే, చివరి ఇన్నింగ్స్లో లక్ష్యాన్ని ఛేదించడం ద్వారా మ్యాచ్ గెలవగలిగింది 22 సార్లు మాత్రమే. ఈ మైదానంలో 148 సంవత్సరాల టెస్ట్ చరిత్రలో, 300 పరుగుల కంటే ఎక్కువ లక్ష్యాన్ని ఒక్కసారి కూడా సాధించలేదు. ఓవల్ స్టేడియంలో సాధించిన అతిపెద్ద లక్ష్యం 263 పరుగులు. ఈ రికార్డు లక్ష్యాన్ని ఇంగ్లాండ్ సాధించింది. ఆ మ్యాచ్ను 1 వికెట్ తేడాతో గెలుచుకుంది. కానీ ఇంగ్లాండ్ 123 సంవత్సరాల క్రితం 1902లో ఈ ఘనత సాధించింది.
ఇప్పటికే ఈ సిరీస్లో ఇంగ్లాండ్ రెండు సార్లు 300+ పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా ఛేజ్ చేసింది. అయితే అవి ఫ్లాట్ పిచ్లపై జరిగినవి. ఓవల్ పిచ్ పరిస్థితి వేరు. ఇక్కడ వేరియబుల్ బౌన్స్ ఉంటుంది. పిచ్ కూడా అరిగిపోతుంది. ఇది ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్లకు పెద్ద సవాలు.
మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ వికెట్ నష్టానికి 50 పరుగులు చేసింది. మ్యాచ్ ఇంకా రెండు రోజులు మిగిలి ఉంది. ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్లు తమ “బజ్బాల్” ఆటతీరుతో దూకుడుగా ఆడతారా, లేదా భారత బౌలర్ల ధాటికి తలవంచుతారా అనేది వేచి చూడాలి. ఇంగ్లాండ్ ఈ లక్ష్యాన్ని చేధించగలిగితే అది ఓవల్ చరిత్రలో ఒక అద్భుతమైన విజయం అవుతుంది. లేకపోతే భారత్ సిరీస్ను 2-2తో సమం చేసి చరిత్ర సృష్టిస్తుంది.