Andhra Pradesh Kumki Elephants First Operation Success: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనుకున్నది సాధించారు.. ఎన్నో ఏళ్ల సమస్యకు చెక్ పెట్టారు. ఈ మేరకు కర్ణాటక నుంచి కుంకీ ఏనుగుల్ని ఏపీకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఏనుగులతో తొలి ఆపరేషన్ను విజయవంతం చేశారు. ఈ మేరకు చిత్తూరు జిల్లా పలమనేరు ప్రాంతంలో ఏనుగుల గుంపును కట్టడి చేసి తిరిగి అడవిలోకి జాగ్రత్తగా తరిమేశారు.
హైలైట్:
- ఏపీలో కుంకీ ఏనుగుల తొలి ఆపరేషన్
- పలనమేరు దగ్గరలో నిర్వహించారు
- ఆపరేషన్ సక్సెస్ చేసిన కుంకీలు

గతవారం తిరుమలకు కాలినడకన వెళ్లే శ్రీవారి మెట్టు మార్గంలో కూడా ఏనుగుల గుంపు సంచారం కలకలం రేపింది. ఈ క్రమంలో శ్రీవారి మెట్టు మార్గంలో భక్తులు జాగ్రత్తగా ఉండాలని తిరుపతి సబ్ డీఎఫ్వో సూచించారు. భాకరాపేట ఎలిఫెంట్ టాస్క్ఫోర్స్(ఈటీఎఫ్)తో కలిసి శ్రీవారి మెట్టు మార్గంలో పర్యటించారు. రంగంపేట దగ్గరలోని సత్యసాయి ఎస్టీ కాలనీ దగ్గర 10 ఏనుగుల గుంపును ఈటీఎఫ్ గుర్తించింది. అవి పంటలపై దాడి చేశాయని కూడా కనుగొన్నారు. భద్రత కోసం బుధవారం ఉదయం 6 గంటలకు శ్రీవారిమెట్టు మార్గాన్ని తాత్కాలికంగా మూసివేశారు. ఏనుగులను అడవిలోకి పంపిన తర్వాత, ఉదయం 7 గంటలకు భక్తులను తిరిగి అనుమతించారు. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష చేశారు.. అధికారులకు కొన్ని సూచనలు చేశారు.
చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఏనుగుల గుంపుల సంచారంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. ఏనుగులు పంట పొలాలను ధ్వంసం చేయడం, ఒక రైతు మరణించడం వంటి ఘటనలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అటవీ శాఖ సిబ్బంది గ్రామాల్లో నిరంతర పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. చంద్రగిరి నియోజకవర్గంలో ఏనుగులు పొలాలు ధ్వంసం చేసిన ఘటనపై అధికారులు ఆయనకు వివరాలు అందించారు. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఏనుగుల గుంపులు ఎక్కువగా తిరుగుతున్నాయని.. దీనిపై అటవీ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఆయన అటవీ శాఖ ఉన్నతాధికారులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఏనుగుల గుంపుల కదలికలు, పంట నష్టం, రైతు మరణం వంటి విషయాలపై సమీక్షించారు.
AP Kumki Elephants: పలమనేరుకు చేరుకున్న కుంకీ ఏనుగులు
చంద్రగిరి నియోజకవర్గంలో ఏనుగులు పొలాలను నాశనం చేశాయని.. ఈ ఘటనపై అధికారులు పవన్ కళ్యాణ్కు సమాచారం ఇచ్చారు. కళ్యాణి డ్యామ్ దగ్గరలోని సత్యసాయి ఎస్టీ కాలనీ వద్ద పొలాలు, తోటలను తొక్కివేశాయని.. ఏనుగుల కదలికలను డ్రోన్ కెమెరాల ద్వారా గమనిస్తున్నామని అధికారులు తెలిపారు. అటవీ శాఖ సిబ్బంది గ్రామాలలో నిరంతర పర్యవేక్షణ చేపట్టాలి.. ప్రజలను అప్రమత్తం చేస్తూ ఉండాలి. ఏనుగులు ఏ మార్గంలో వెళ్లే అవకాశం ఉందో గుర్తించి, ఆ గ్రామస్తులను అప్రమత్తం చేయాలని సూచించారు. దీనికోసం గ్రామాల వారీగా వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి, ముందుగా హెచ్చరికలు పంపాలి’ అని పవన్ కళ్యాణ్ సూచనలు చేశారు. మొత్తానికి
అడవి ఏనుగులు పంటల వైపు రాకుండా కుంకీ గజరాజులు అడ్డుకున్నాయి.. తొలి మిషన్ సక్సెస్ కావడంతో రైతులు ఆనందంలో ఉన్నారు.