Nara Lokesh: దళిత యువకుడిపై వైసీపీ శ్రేణులు దాడి చేశారని వైరల్ అవుతున్న వీడియోను షేర్ చేసిన.. మంత్రి నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు. వైసీపీ చేసిన ఆగడాలు భరించలేని ఏపీ ప్రజలు.. అధికారం నుంచి దించేసినా.. వారి తీరు మారడం లేదని అసహనం వ్యక్తం చేశారు. రప్పా రప్పా అంటే.. పోలీసులు రఫ్పాడిస్తారని హెచ్చరికలు చేశారు. ఈ సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో జరిగిన ఘటనలను నారా లోకేష్ గుర్తు చేశారు.

“ప్రజలు ఛీత్కరించినా వైసీపీ నాయకుల బుద్ధి మారడం లేదు. అధికారంలో ఉన్నప్పుడు డాక్టర్ సుధాకర్ గారి దగ్గర నుంచి డ్రైవర్ సుబ్రహ్మణ్యం డెడ్ బాడీ డోర్ డెలివరీ వరకూ దళితులపై దమనకాండ జరిపిన వైసీపీ నాయకులు ఇప్పుడు కూడా అదే పంథా కొనసాగిస్తున్నారు. తిరుపతిలో దళిత యువకుడిపై వైసీపీ నాయకులు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇటువంటి దాడులకు ఏపీలో చోటు లేదు. రప రపా అంటే ఏపీ పోలీస్ రఫ్ఫాడిస్తారు!” అని నారా లోకేష్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్లో ఒక యువకుడిని కొంతమంది కొడుతున్నట్లు ఉన్న వీడియోను ట్యాగ్ చేశారు.
తిరుపతిలో ఒక యువకుడిపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే, తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అనుచరులు దాడి చేసి, రెచ్చిపోతుండటంపై మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా స్పందించారు. వైసీపీ నేతలు తమ తీరు మార్చుకోవడం లేదని.. అధికారం పోయినప్పటికీ అదే రీతిలో దాడులు చేస్తున్నారంటూ తీవ్రంగా విరుచుకుపడ్డారు.
తిరుపతిలోని శ్రీనివాసం వసతి గృహం ఎదురుగా ఉన్న దుకాణం కాంట్రాక్ట్ను తమకు రాసి ఇవ్వాలంటూ వైసీపీ సోషల్ మీడియా ఇంఛార్జ్ అనిల్ రెడ్డి బుధవారం రాత్రి దౌర్జన్యానికి దిగారు. ఎంఆర్పల్లిలోని పవన్ అనే యువకుడిని కిడ్నాప్ చేసి చిత్ర హింసలకు గురి చేశారు. అయితే పవన్ను లాఠీతో ఇష్టం వచ్చినట్లు కొడుతుండగా.. అనిల్ రెడ్డి ఫ్రెండ్స్ తీసిన వీడియో బయటికి రాగా.. అది ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మరోవైపు.. భూమన కరుణాకర్రెడ్డి అనుచరులు చేస్తున్న ఆగడాలపై ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత తీవ్రంగా మండిపడ్డారు. రౌడీ రాజకీయం చేస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్లోని తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని.. ఎలాంటి వారైనా చట్టం ముందు సమానమేనని తేల్చి చెప్పారు.