Andhra Pradesh in India Justice Report: ఇండియా జస్టిస్ రిపోర్టు 2025 ర్యాంకింగ్స్లో ఏపీ రెండో స్థానంలో నిలిచింది. 2022లో ఐదో స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఈ ఏడాది రెండో స్థానానికి చేరటం విశేషం. మరోవైపు ఈ జాబితాలో కర్ణాటక తొలి స్థానంలో ఉంది. ఏపీ రెండో స్థానంలో నిలవగా.. తెలంగాణ మూడు, కేరళ నాలుగో స్థానంలో ఉన్నాయి.

మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల భద్రత కోసం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శక్తి యాప్ అందుబాటులోకి తీసుకువచ్చింది. మహిళలు ఆపదలో చిక్కుకున్నప్పుడు, అత్యవసర సమయాల్లో ఈ శక్తి యాప్ ద్వారా పోలీసులు సహాయం వెంటనే పొందేందుకు వీలవుతుంది. ఈ శక్తి యాప్లో ఫిర్యాదు చేయడం, లైవ్ ట్రాకింగ్, పోలీసులను అలర్ట్ చేయడం వంటి అంశాలు ఉన్నాయి. అంతేకాదు శక్తి యాప్ రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లతో అనుసంధానమై ఉంటుంది. దీనితో పాటుగా జిల్లాలలో శక్తి బృందాలు ఏర్పాటు చేశారు. ఈ శక్తి బృందాలు కాలేజీలు, బస్టాండులు, పార్కుల వంటి ప్రదేశాల్లో సంచరిస్తూ అమ్మాయిలను వేధించే ఈవ్ టీజర్లు, పోకిరీల పనిబడుతూ ఉంటాయి. అలాగే సఖి నివాస్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు.
అలాగే సాంకేతిక వినియోగం ద్వారా నేరాలను అరికట్టడంతో పాటుగా నేరస్థులను పట్టుకోవటంలో ఏపీ పోలీసులు మెరుగైన పనితీరు కనబరుస్తున్నారు. మారుమూల ప్రాంతాల్లో డ్రోన్లను ఎగరవేస్తూ అసాంఘిక శక్తుల పని పడుతున్నారు. డ్రగ్స్ రవాణా, గంజాయి స్మగ్లింగ్, జూదం, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలకు శివారు ప్రాంతాలు అడ్డాగా మారుతున్నాయి.
ఈ నేపథ్యంలో అలాంటి అనుమానిత ప్రాంతాలలో డ్రోన్లను ఎగరవేస్తూ వారి ఆట కట్టిస్తున్నారు. అలాగే సీసీ కెమెరాల ఏర్పాటుతో అనుక్షణం నిఘా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే కుటుంబాలలో ఏవైనా సమస్యలు ఉంటే కౌన్సిలింగ్ ద్వారా సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వీటితో పాటుగా ఈగల్ టీమ్ ద్వారా గంజాయి స్మగ్లర్ల ఆట కట్టిస్తున్నారు.