భార్య కాపురానికి రావట్లేదనే మనస్తాపంలో భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలంలో వెలుగు చూసింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీబీపేట మండలం కోనాపూర్ గ్రామానికి చెందిన గోర్కంటి స్వామికి నాలుగేళ్ల క్రితం మల్లు పల్లి గ్రామానికి చెందిన శిరీషతో వివాహం జరిగింది. వీరు వ్యవసాయం చేస్తూ జీనం సాగిస్తున్నారు. అయితే పెళ్లైన కొన్నాళ్ల వరకు వీళ్ల కాపురం బాగానే సాగింది. కానీ గత కొద్ది రోజులుగా భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతున్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది.
అయితే తరచూ ఇంట్లో భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతుండడంతో.. అవి భరించలేక భార్య మల్లు పల్లిలోని తన పుట్టింటికి వెళ్లిపోయింది. భర్త పలుమార్లు వెళ్లి ఇంటికి రావాలని పిలిచినా భార్య రాకపోవడంతో గత కొన్ని రోజులుగా స్వామి తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల పెద్ద మల్లారెడ్డి గ్రామంలోని సబ్ స్టేషన్ వద్దకు వెళ్లి అక్కడే ఉన్న ఒక వేప చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
చెట్టుకు వేళాడుతున్న స్వామిని చూసిన గ్రామస్తులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటీన ఘటనా స్థలానికి చేరుకున్న వారు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.