Telangana Rythu Bharosa Scheme: తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. భూమి ఉన్న రైతు ఈ పథకం కింద ఎకరాకు రూ.6000 చొప్పున అందుకుంటున్నారు. అయితే రెండు విడతలుగా మొత్తం రూ.12000 రైతుల ఖాతాలో జమ చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2018లో రైతు బంధు పేరుతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతు బంధు పథకాన్ని రైతు భరోసాగా మార్చింది. రైతు భరోసా కింద రైతులకు ఏడాదికి ఎకరానికి రూ.12,000 చొప్పున (రెండు దఫాల్లో) పెట్టుబడి సాయం అందిస్తోంది. రైతు భరోసా పథకం ముఖ్య ఉద్దేశం వ్యవసాయంలో రైతులకు ఆర్థికంగా సాయం అందించడం.
రైతు భరోసా పథకానికి అర్హులు ఎవరు?
ఈ రైతు భరోసా పథకానికి అందరు అర్హులు కారు. ఈ పథకం ప్రయోజనం పొందాలంటే తెలంగాణ రాష్ట్రానికి చెందిన రైతు అయి ఉండాలి. అలాగే రైతు కనీస వయస్సు 18 సంవత్సరాలు ఉండాలి. అలాగే ఈ పథకం సాయం పొందాలంటే భూమి దరఖాస్తుదారుడి పేరు మీద ఉండాలి. అది కూడా వ్యవసాయానికి అనుకూలమైన భూమి ఉండాలి. ఆ భూమి దరణి పోర్టల్లో నమోదై ఉండాలి.
అలాగే సాగుకు యోగ్యం కాని భూములు (బీడు భూములు, రాళ్లు రప్పలు, కొండలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, కాల్వలు, వాణిజ్య సముదాయాలకు చెందిన భూములు) ఉన్నవారు రైతు భరోసా పథకానికి అర్హులు కారు.
ఇవి కూడా చదవండి
రైతు భరోసా పథకానికి కొత్తగా ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
ఇక గతంలో రైతుబంధు పథకం కింద దరఖాస్తు చేసుకున్న రైతులు ఇప్పుడు మళ్లీ రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. వారి వివరాలు ఇప్పటికే ప్రభుత్వ వద్ద ఉంటాయి. కొత్త రైతులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
ఈ పథకానికి ప్రస్తుతం ఆన్లైన్ దరఖాస్తు సౌకర్యం అందుబాటులో లేదు. కొత్తగా దరఖాస్తు చేసుకునే రైతులు తప్పనిసరిగా ఆఫ్లైన్లో, అంటే నేరుగా మండలంలోని వ్యవసాయ విస్తీర్ణ అధికారికి లేదా క్లస్టర్ అధికారికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పథకం వెబ్సైట్ .
దరఖాస్తు కోసం కావాల్సిన పత్రాలు:
- పట్టాదారు పాసుపుస్తకం జిరాక్స్ కాపీ
- ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ
- బ్యాంక్ సేవింగ్ ఖాతా జిరాక్స్ కాపీ
- పూర్తిగా నింపిన దరఖాస్తు ఫారం
ఈ రైతులు ఈ పథకానికి అనర్హులు:
- తెలంగాణ రాష్ట్రానికి చెందని రైతులు అనర్హులు.
- వ్యవసాయ యోగ్యం కాని భూమి ఉన్నవారు.(బీడు భూములు, రాళ్లు రప్పలు ఉన్న భూములు, కొండలు, రియల్ ఎస్టేట్ వెంచర్లలోని భూములు, కాల్వలు, వాణిజ్య సముదాయాలకు చెందిన భూములు)
- ధరణి పోర్టల్లో భూమి వివరాలు నమోదు కాని రైతులు.
- ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు.
- వ్యవసాయం చేస్తూ పెన్షన్ పొందుతున్న కొంత మంది రైతులు అనర్హులు.
- ఆదాయపు పన్ను చెల్లించే రైతులు.
- రాజ్యాంగబద్ధమైన పదవులు (ప్రజాప్రతినిధులు) కలిగి ఉన్నవారు.
- దేవాలయాలు, ట్రస్టులు లేదా ఇతర సంస్థల పేరు మీద ఉన్న వ్యవసాయ భూములకు రైతు భరోసా పథకం వర్తించదు.
అయితే పథకానికి సంబంధించిన అర్హత విషయంలో నియమ నిబంధనలు మారుతుండవచ్చు. దరఖాస్తు చేసుకునే ముందు ఈ పథకం పొందేందుకు ఎలాంటి నియమాలు ఉన్నాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం. తాజా సమాచారం కోసం వ్యవసాయ శాఖ అధికారిక వెబ్సైట్ను చూడాలి. లేదా స్థానిక వ్యవసాయ అధికారులను సంప్రదించడం మంచిది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

