తిరుమలలో భక్తుల కోసం టీటీడీ ఏర్పాటు చేసిన స్మార్ట్ ఫుట్వేర్ ట్రాకింగ్ సిస్టమ్ మంచి ఫలితాలను ఇస్తోంది. గతేడాది సెప్టెంబర్ నుంచి ఈ విధానం అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకూ ఎన్ని లావాదేవీలు జరిగాయనే వివరాలను టీటీడీ వెల్లడించింది. ఈ వ్యవస్థ ద్వారా భక్తులకు మెరుగైన సేవలు అందించటంతో పాటుగా తిరుమలలో పరిశుభ్రతను మెరుగుపరుస్తున్నామని తెలిపింది. రాబోయే రోజులలో అదనపు కౌంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది.

రద్దీ అధికంగా ఉండే ప్రాంతాల్లో శ్రీవారి భక్తులకు ఈ విధానం ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తోందని టీటీడీ చెప్తోంది. గతంలో తిరుమలలోని రద్దీ ప్రాంతాల్లో పాదరక్షలు ఎక్కడికక్కడే ఉంటూ భక్తులకు ఇబ్బందులు కలిగించేవి. ఈ నేపథ్యంలోనే ఆ సమస్యలకు పరిష్కారంగా టీటీడీ ఈ విధానానికి శ్రీకారం చుట్టింది. కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ సహకారంతో ఈ విధానం అమలు చేస్తున్నారు. ఈ విధానం అమలు కాకముందు పాద రక్షలు కనిపించకుండా పోవటం వంటి సమస్యలతో భక్తులు ఇబ్బందులు పడేవారు. అయితే ఈ వ్యవస్థ అందుబాటులోకి వచ్చిన తర్వాత అలాంటి సమస్యలు పూర్తిగా తొలగిపోయాయని భక్తులు చెప్తున్నారు.
భక్తుల రద్దీ అధికంగా ఉండే ప్రాంతాల్లో అవసరం మేరకు భవిష్యత్తులో అదనపు కౌంటర్లు ఏర్పాటు చేసే విషయంపై టీటీడీ అధికారులు ఆలోచనలు చేస్తున్నారు. అలాగే సిబ్బంది సంఖ్యను పెంచడం ద్వారా ఈ వ్యవస్థను మరింత విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా త్వరలోనే బేడి ఆంజనేయస్వామి ఆలయం, కల్యాణకట్ట, ఏటీసీ సర్కిల్ వద్ద అదనంగా మూడు కేంద్రాలు ఏర్పాటు చేయాలని టీటీడీ నిర్ణయించింది.
మరోవైపు తిరుమల శ్రీవారి ఆలయం చుట్టూ ఉండే మాడ వీధుల్లో పాద రక్షలు ధరించడం నిషిద్ధం. ఈ నేపథ్యంలో భక్తులు తప్పనిసరిగా ఈ విధానాన్ని ఉపయోగించుకోవాలని టీటీడీ చెప్తోంది. ఈ వ్యవస్థ వల్ల తిరుమలలో పరిశుభ్రత మరింత మెరుగవ్వటమే కాకుండా.. భక్తులకు సౌకర్యమైన, ఆహ్లాదకరమైన దర్శన అనుభవం అందించవచ్చని భావిస్తోంది.


