తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంపై ఏపీ సీఎం చంద్రబాబు అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ వ్యవహారంపై ఏపీ అసెంబ్లీలో లఘు చర్చ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు.. కల్తీ నెయ్యితో 20 కోట్ల లడ్డూలు తయారు చేశారని ఆరోపించారు. తప్పులు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సిట్ రిపోర్టు పంపించిందన్న చంద్రబాబు.. అందుకే ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేశామన్నారు. మరోవైపు దోషులు ఎవరైనా శిక్ష పడాలని పవన్ కళ్యాణ్ కోరారు.

ఈ విషయంలో రాజకీయ వివాదం ఉండకూడదనే ఉద్దేశంతో సెట్ ఏర్పాటు చేశారన్న చంద్రబాబు.. సుప్రీంకోర్టు సీబీఐ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయాలని సూచించిందన్నారు. సీబీఐ సెట్ కూడా తప్పుచేసిన అధికారుల మీద చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి నివేదిక పంపించిందని వివరించారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఏక సభ్య కమిషన్ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు చంద్రబాబు వివరించారు.
మరోవైపు తిరుమల లడ్డూనే కాకుండా అనే విషయాల్లో గతంలో తప్పులు జరిగాయని చంద్రబాబు ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో 59.71లక్షల లీటర్ల మేరకు కల్తీ నెయ్యి వినియోగించారని చంద్రబాబు ఆరోపించారు. రూ.231.51 కోట్ల మేరకు అక్రమాలు జరిగాయని శాసనసభలో ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంగా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. కల్తీ నెయ్యి అని నిర్ధారణ అయిన తర్వాత కూడా రిపోర్టును తొక్కిపెట్టారంటూ వైసీపీపై విమర్ళలు గుప్పించారు. లడ్డూలో జంతుకొవ్వు కలిసిందని ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్టునే తాను చదివానన్న చంద్రబాబు.. ఆ భగవంతుడే తనతో చెప్పించాడని శాసనసభలో అన్నారు.
దోషులు ఎవరైనా శిక్ష పడాల్సిందే..
మరోవైపు తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో దోషులకు తప్పకుండా శిక్షపడాల్సిందేనని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. లఘు చర్చలో మాట్లాడిన పవన్ కళ్యాణ్.. ఈ వ్యవహారంలో దోషులు ఎవరైనా సరే శిక్ష పడాలని అన్నారు. జంతు సంబంధిత రసాయనాలు ఉన్నాయని ఎన్డీడీబీ రిపోర్టు చెప్పిందన్న పవన్ కళ్యాణ్.. అసలు నెయ్యే కాదని సీబీఐ సిట్ నివేదిక ఇచ్చిందన్నారు. కల్తీనెయ్యిలో ఏ కెమికల్స్ వాడారనేదీ ఆ పెరుమాళ్లకే తెలియాలని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు.


