ఈ ఏడాదిలో వస్తున్న తొలి చంద్రగ్రహణం కారణంగా.. హిందువులకు అత్యంత పవిత్రమైన పండగలలో ఒకటైన హోలీని ఎప్పుడు జరుపుకోవాలనే సందిగ్ధత ఏర్పడింది. మార్చి 3న చంద్రగ్రహణం ఏర్పడుతోంది. ఆరోజునే హోలీ పండగ కూడా వచ్చింది. దీంతో ఆరోజు పండగ జరుపుకోవాలా? వద్దా? అనేదానిపై జ్యోతిష్య పండితులు తర్జనాభర్జనలు పడ్డారు. చివరకు చంద్రగ్రహణం కారణంగా హోలీని ఆరోజు జరుపుకోకూడదని పండితులు నిర్ణయించారు. చంద్రగ్రహణానికి ముందు రోజు హోలికా దహనం, గ్రహణం తర్వాతి రోజున హోలీ పండగను జరుపుకోవాలని నిర్ణయించారు. దీంతో హోలీ పండగను ఏ రోజు నిర్వహించాలన్న గందరగోళానికి తెరపడినట్లయింది. దీంతో తెలుగు ప్రజలు హోలీ పండగను మార్చి 4న జరుపుకోనున్నారు.
ఉమ్మడి పాలమూరు జిల్లా బ్రహ్మణ సంఘాల ఆధ్వర్యంలో చంద్రగ్రహణం సందర్భంగా హోలీ పండగకు ఏర్పడ్డ సందిగ్ధతను తీర్చడానికి ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించిన అనేక మంది జ్యోతిష్య పండితులచే చర్చ జరిగింది. ఈ సమావేశంలోనే హోలీ పండగ నిర్వహించుకునే విషయంలో ఓ స్పష్టతను తీసుకొచ్చారు.
హోలీ పండగ
మార్చి 2 సోమవారం రోజు రాత్రి కామ దహనం. మార్చి 4వ తేదీ బుధవారంనాడు హోలీ పండగ (వసంతోత్సవం) నిర్వహించుకోవాలని నిర్ణయించారు. దీంతో యావత్ హిందూబంధువులు ఈ విధంగానే పండగ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని పండితులు సూచించారు. ఇక, మార్చి 3 మంగళవారంనాడు చంద్రగ్రహణం ఉండటంతో హోలీ పండగ జరుపుకోకూడదు. ప్రత్యక్ష దైవం చంద్రుడు వేదకు గురి అయి ఉంటాడు కాబట్టి.. ఆరోజు పండగ నిర్వహించుకోవడం శాస్త్ర విరుద్ధమని పండితులు తెలిపారు.
గ్రహణ సమయంలో పాటించాల్సిన నియమాలు
-
ఆహారం: గ్రహణ సమయంలో ఆహారం తీసుకోవడం మానుకోడం సనాతన సంప్రదాయం ప్రకారం మంచిది. మధ్యాహ్నం 12 గంటల లోపు భోజనం పూర్తి చేసుకోవాలి.
-
ఇంట్లో శుభ్రత: ఇంట్లో ఉన్న ఊరగాయలు, పచ్చళ్ళ పై దర్భాలు ఉంచడం శుభకారకం.
-
స్నానాలు: గ్రహణానికి ముందే, తరువాత కూడా శుద్ధి స్నానాలు చేయడం అవసరం.
-
గ్రహణ సమయంలో జాగ్రత్తలు: గ్రహణం జరుగుతున్నప్పుడు సముద్రం లేదా నదిలో స్నానం చేయడం శుభంగా భావించబడుతుంది.
-
సాయంత్రం భోజనం: రాత్రి 7:30 తర్వాత స్నానం చేసి, దైవారాధన అనంతరం మాత్రమే భోజనం చేయడం మంచిది.
ఏ రాశుల వారు గ్రహణం చూడకూడదు?
ఈ కేతుగ్రస్త చంద్రగ్రహణం సింహరాశిలో జరుగుతున్నందున, సింహరాశి వారు గ్రహణాన్ని నేరుగా చూడకపోవడం మంచిదని పండితులు సూచిస్తున్నారు.
ప్రత్యేక జాగ్రత్త: గర్భిణీ స్త్రీలు చంద్రకిరణాలు తగలకుండా ఇంట్లో ఉండడం శ్రేయస్కరం.
గ్రహణ పరిహారాలు
-
సింహ, కర్కాటక, మకర, కుంభ రాశుల వారు.. గ్రహణం తరువాత ఆలయానికి వెళ్లి, తెల్లని వస్త్రంపై బియ్యం రాసి, దానిపై వెండి చంద్రబింబాన్ని ఉంచి, దక్షిణ తాంబూలాలతో బ్రాహ్మణునికి దానం చేయడం శ్రేయస్కరం.
-
మిగిలిన రాశుల వారు.. ఈ గ్రహణం మధ్యమ లేదా శుభ ఫలితాలను ఇస్తుందని భావించవచ్చు.
(Disclaimer: ఈ వార్తలోని సమాచారం జ్యోతిష్య శాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. దీనిని సంస్థ ధృవీకరించదు.)

