ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ మీద ఓ పోలీస్ అధికారి.. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దేవరకొండ నాగవరప్రసాద్ అనే అధికారి తుళ్లూరు పోలీస్ స్టేషన్లో వీరిపై ఫిర్యాదు చేశారు. తిరుమల శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వు కలిపారంటూ పదే పదే ఆరోపణలు చేయడంతో మనస్తాపం చెంది ఫిర్యాదు చేసినట్లు నాగ వరప్రసాద్ విలేకర్లకు వెల్లడించారు. అలాగే కొన్ని మీడియా ఛానెళ్ల మీద ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

ఈ నేపథ్యంలోనే పోలీసులను కలిసి ఫిర్యాదు చేశానన్న నాగ వరప్రసాద్.. తన ఫిర్యాదులో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు పేర్లను ప్రస్తావించినట్లు తెలిపారు. అలాగే కొన్ని మీడియా ఛానెళ్లపైనా ఫిర్యాదు చేశారు. తిరుమల లడ్డూ అంశంపై డిబేట్లు నిర్వహించి.. భక్తులు వినడానికి కూడా ఇబ్బంది కలిగించేలా మాట్లాడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. వీరందరిపైనా చర్యలు తీసుకోవాలని నాగ వరప్రసాద్ డిమాండ్ చేశారు. అలాగే ఏయే తేదీలలో ఎవరెవరు ఏయే వ్యాఖ్యలు చేశారనే దానిపై నివేదికను పోలీసులకు అందించినట్లు తెలిపారు.
తుళ్లూరు పోలీసులు తన ఫిర్యాదును తీసుకున్నప్పటికీ.. అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వలేదన్న నాగ వరప్రసాద్.. దీనిపై న్యాయపోరాటం చేస్తానని స్పష్టం చేశారు. మరోవైపు తాను గతంలో శ్రీకాకుళం డీటీసీలో పనిచేసినట్లు నాగ వరప్రసాద్ తెలిపారు. అనంతరం అనంతపురం పీటీసీకి బదిలీ చేశారని..అయితే అనారోగ్య కారణాలతో మెడికల్ లీవ్ తీసుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం తాను మెడికల్ లీవ్లో ఉన్నట్లు తెలిపారు. తాను స్వచ్ఛంద పదవీ విరమణ కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నప్పటికీ సరైన స్పందన లేదని ఆరోపించారు. ఈ నెలాఖరులోపు తన రాజీనామాను ఆమోదించాలని కోరినా పట్టించుకోవడం లేదన్నారు. మరోవైపు తిరుమల లడ్డూ విషయంలో చట్టపరంగా ముందుకెళ్లి బాధ్యులపై చర్యలు తీసుకునేలా పోరాటం చేస్తానన్నారు.


