
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో హార్ముజ్ జలసంధి మూసివేత వార్తలు ప్రపంచ ఇంధన మార్కెట్లను కలవరపెడుతున్నాయి. అయితే భారతదేశానికి తక్షణ చమురు సరఫరా అంతరాయం వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశంలో కనీసం 10 రోజుల ముడి చమురు నిల్వలు, అదనంగా 5–7 రోజుల ఇంధన నిల్వలు సిద్ధంగా ఉన్నాయని వారు తెలిపారు. అమెరికా–ఇజ్రాయెల్ దాడులకు ప్రతిస్పందనగా ఇరాన్ హార్ముజ్ జలసంధి మూసివేసినట్లు తెలిపినప్పటికీ, దీర్ఘకాలికంగా అది కొనసాగుతుందనే సూచనలు లేవని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు ఐదో వంతు ఈ కీలక మార్గం ద్వారానే రవాణా అవుతుంది.
భారతదేశం తన ముడి చమురులో సుమారు 88 శాతం దిగుమతులపై ఆధారపడుతోంది. రోజుకు సుమారు 2.5–2.7 మిలియన్ బ్యారెళ్లు, అంటే దాదాపు 50 శాతం దిగుమతులు హార్ముజ్ మార్గం ద్వారానే వస్తున్నాయి. ఇవి ప్రధానంగా ఇరాక్, సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్ వంటి దేశాల నుంచి వస్తాయి. అదేవిధంగా దేశ LNG దిగుమతుల్లో సుమారు 60 శాతం, LPG దిగుమతుల దాదాపు మొత్తం హార్ముజ్ మార్గంపై ఆధారపడినవే కావడంతో, దీర్ఘకాలిక మూసివేత జరిగితే ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని అధికారులు అంగీకరిస్తున్నారు.
ధరలపై ప్రభావం
ఇప్పటికే బ్రెంట్ క్రూడ్ ధరలు ఏడు నెలల గరిష్టానికి చేరుకుని బ్యారెల్కు సుమారు 73 డాలర్ల వద్ద ముగిశాయి. సరఫరా అంతరాయం తీవ్రత పెరిగితే ధరలు 80 డాలర్ల వైపు కదిలే అవకాశం ఉందని ట్రేడర్లు అంచనా వేస్తున్నారు. దీంతో దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలపై పరోక్ష ఒత్తిడి ఏర్పడవచ్చు. అధికారుల ప్రకారం అవసరమైతే భారత్ దిగుమతులను మళ్లించే సామర్థ్యం కలిగి ఉంది. రష్యా, ఆఫ్రికా, వెనిజులా, బ్రెజిల్ వంటి ప్రత్యామ్నాయ సరఫరాదారుల నుంచి కొనుగోళ్లు పెంచే అవకాశం ఉంది. అదనంగా వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలు కూడా ఒక వారం అవసరాలను తీర్చగలవు. అయితే ఒక సవాలు మాత్రం ఉంది మధ్యప్రాచ్యం నుంచి చమురు రావడానికి సుమారు 5 రోజులు పడితే, రష్యా నుంచి రవాణాకు కనీసం ఒక నెల సమయం పడుతుంది. కాబట్టి ముందస్తు ప్రణాళిక కీలకం అని అధికారులు చెబుతున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
