AP Govt Request On Vijayawada Mahanadu Junction Elevated Corridor Plan Again: విజయవాడలో ఇటీవల కాలంలో ట్రాఫిక్ సమస్యలు ఎక్కువయ్యాయి. ముఖ్యంగా నేషనల్ హైవే 16 విజయవాడ నగరం మధ్యలో నుంచి వెళుతుండటంతో ట్రాఫిక్ కష్టాలు ఎదురవుతున్నాయి. అందుకే గతంలో మహానాడు జంక్షన్ నిడమానూరు మధ్య ఎలివేటెడ్ వంతెనను ప్లాన్ చేశారు. కానీ ఆ తర్వాత ఈ ప్రాజెక్టును పక్కన పెట్టారు. ఇప్పుడు మళ్లీ ఆ ప్రాజెక్ట్ అంశంపై తెరపైకి వచ్చింది.
హైలైట్:
- విజయవాడలో మరో ఎలివేటెడ్ వంతెన
- గతంలో ప్రతిపాదించినా పక్కన పెట్టారు
- మరోసారి తెరపైకి వచ్చిన ప్రాజెక్టు
- NHAIకు ఏపీ సర్కార్ నుంచి రిక్వెస్ట్

ఈ ఎలివేటెడ్ వంతెన ప్రాజెక్టు పట్టాలెక్కుతుందనుకుంటున్న సమయంలో కొన్ని కారణాలతో ఎన్హెచ్ఏఐ అధికారులు పక్కన పెట్టారు. తాజాగా ఏపీ ప్రభుత్వం ఈ మహానాడు-నిడమానూరు ఎలివేటెడ్ బ్రిడ్జి ప్రాజెక్టును తెరపైకి తెచ్చింది. ఈ బ్రిడ్జి విజయవాడలో చాలా కీలకమంటూ.. ఆవశ్యకతను ఎన్హెచ్ఏఐ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించింది. ఈ వంతెనను వన్టైమ్ ఇంప్రూవ్మెంట్ కింద నిర్మించాలని రిక్వెస్ట్ చేయనుంది. చెన్నై-కోల్కతా నేషనల్ హైవే 16 విజయవాడ మధ్యలో నుంచి వెళుతుండటంతో ట్రాఫిక్ సమస్యలతో వాహనదారులు ఇబ్బందిపడుతున్నారు.
ఈ పరిస్థితిని గమనించిన ఏపీ ప్రభుత్వం మహానాడు కూడలి నుంచి నిడమానూరు రైల్వే వంతెన అవతలి వరకు బ్రిడ్జిని నిర్మించాలని కోరనుంది. మొత్తం 7 కిలోమీటర్ల మేర ఎలివేటెడ్ వంతెనను గతంలో ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్టుకు ఎన్హెచ్ఏఐ గ్రీన్సిగ్నల్ ఇవ్వడంతో డీపీఆర్ను కూడా సిద్ధం చేయించారు. మరి ఏపీ ప్రభుత్వం రిక్వెస్ట్పై ఎన్హెచ్ఏఐ ఎలా స్పందిస్తుందన్నది చూడాలి.. ఒకవేళ ఓకే చెబితే పాత డీపీఆర్ వైపు మొగ్గు చూపుతారా.. కొత్తగా మళ్లీ డీపీఆర్ సిద్ధం చేస్తారా అన్నది చూడాలి. మొత్తం మీద ఏపీ ప్రభుత్వం విజయవాడలో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా కొత్తగా ఎలివేటెడ్ వంతెనను మరోసారి తెరపైకి తీసుకొచ్చింది.


