International
oi-Jakki Mahesh
పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభం ఆ దేశాన్ని అంతర్జాతీయ వేదికపై మరోసారి తలదించుకునేలా చేసింది. షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం మరోసారి తీవ్ర అవమానాన్ని ఎదుర్కొంది. ఇస్లామాబాద్లోని ఓ విలాసవంతమైన హోటల్ బిల్లు కూడా చెల్లించలేని స్థితికి ఆ దేశ ప్రభుత్వం చేరుకుంది. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య శాంతి చర్చల కోసం ఇస్లామాబాద్లోని ప్రతిష్టాత్మక ‘సెరెనా హోటల్’ను వేదికగా ఎంచుకున్నారు. అయితే ఈ చర్చల తర్వాత హోటల్ బిల్లు చెల్లించాల్సిన బాధ్యతను పాక్ ప్రభుత్వం విస్మరించింది. కనీసం ఆ అతిథుల బిల్లులు కూడా కట్టలేని ఆర్థిక కౌశల్యం పాకిస్థాన్కు లేదని స్పష్టమైంది. చివరికి హోటల్ యజమాని ‘ఆగా ఖాన్ డెవలప్మెంట్ నెట్వర్క్’ స్వయంగా ముందుకు వచ్చి ఆ ఖర్చులన్నింటినీ భరించాల్సి రావడం గమనార్హం.
21 గంటల చర్చలు.. సున్నా ఫలితం
అమెరికా, ఇరాన్ వంటి అగ్రదేశాల మధ్య చర్చలకు ఆతిథ్యం ఇవ్వడం ద్వారా తాను అంతర్జాతీయంగా ఓ బలమైన మధ్యవర్తినని ప్రపంచానికి చాటి చెప్పాలని పాకిస్థాన్ భావించింది. దీనిని తమ దౌత్య విజయంగా ప్రచారం చేసుకుంది. కానీ ఒక సాధారణ హోటల్ బిల్లు కూడా కట్టలేకపోవడం ఆ దేశ ఆర్థిక కష్టాలను, పరిపాలనా వైఫల్యాలను ఎండగట్టింది. ఇది పాకిస్థాన్ ప్రతిష్టను దిగజార్చడమే కాకుండా కమ్యూనికేషన్, పబ్లిక్ రిలేషన్స్ పరంగా పెద్ద విపత్తుగా మారింది.

ఇస్లామాబాద్లోని సెరెనా హోటల్లో అమెరికా, ఇరాన్ ప్రతినిధుల మధ్య దాదాపు 21 గంటల పాటు మారథాన్ చర్చలు జరిగాయి. ఇరాన్ అణు కార్యక్రమం, ఆర్థిక ఆంక్షల తొలగింపు, ప్రాంతీయ భద్రత వంటి కీలక అంశాలపై ఇరుపక్షాలు చర్చించాయి. అయితే ఇంత సమయం వెచ్చించినా ఏ ఒక్క విషయంలోనూ ఏకాభిప్రాయం కుదరలేదు. ఫలితంగా ఈ శాంతి చర్చలు ఎటువంటి ఒప్పందం లేకుండానే ముగిశాయి. అటు శాంతి చర్చలు విఫలం కావడం, ఇటు హోటల్ బిల్లు వివాదం పాకిస్థాన్కు రెండు వైపులా ఎదురుదెబ్బ తగిలినట్లయింది.
కటిక పేదరికంలో పాకిస్థాన్
ప్రస్తుతం పాకిస్థాన్ తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి ఆంక్షల మధ్య నలుగుతున్న ఆ దేశంలో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయింది. విదేశీ మారక నిల్వలు అడుగంటిపోయాయి. యూఏఈ వంటి దేశాలు కూడా తామిచ్చిన అప్పులు తీర్చాలని ఒత్తిడి చేస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో దేశీయంగా తిండికే కటకటలాడుతుంటే, విదేశీ దౌత్యానికి ఆతిథ్యం ఇవ్వడం పాకిస్థాన్కు మోయలేని భారంగా మారిందని రక్షణ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

