
మరణంలోనూ జీవిస్తూ. మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచాడు 22 ఏళ్ల యువకుడు ఉదయ్ కిరణ్. సంగారెడ్డి మండలం కొత్లాపూర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ కుమారుడు ఉదయ్ కిరణ్ (22) బీటెక్ పూర్తి చేసి, ఉన్నత ఆశయాలతో హైదరాబాద్లో కోచింగ్ తీసుకుంటున్నాడు. రోజూలాగే ఈ నెల 4వ తేదీన కోచింగ్ ముగించుకుని ఇంటికి వస్తుండగా.. నిజాంపేట బస్టాప్ వద్ద బస్సు ఎక్కుతుండగా ఒక్కసారిగా కళ్లు తిరిగి కింద పడిపోయాడు. ఈ ప్రమాదంలో ఉదయ్ తలకు తీవ్ర గాయమైంది. గమనించిన స్థానికులు వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.
వెంటనే అక్కడికి చేరుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స అందించారు. వైద్యులు శాయశక్తులా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. శనివారం రాత్రి ఉదయ్ కిరణ్ ‘బ్రెయిన్ డెడ్’ అయినట్లు వైద్యులు ధృవీకరించారు. పుట్టెడు దుఃఖంలో ఉన్నప్పటికీ, ఉదయ్ కిరణ్ తల్లిదండ్రులు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. తమ కొడుకు భౌతికంగా లేకపోయినా, అతని అవయవాల ద్వారా మరికొందరిలో బతకాలని భావించారు.
జీవన్ దాన్ ప్రతినిధుల కౌన్సెలింగ్తో అవయవదానానికి అంగీకరించారు. ఉదయ్ కిరణ్ నుంచి సేకరించిన గుండె, కాలేయం, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, కళ్లు ఇలా మొత్తం 8 మందికి అమర్చి వారికి పునర్జన్మను ఇచ్చారు. ఆదివారం ఉదయ్ కిరణ్ స్వగ్రామమైన కొత్లాపూర్లో కన్నీటి వీడ్కోలు మధ్య అంత్యక్రియలు జరిగాయి. ఆశయాల బాటలో పయనిస్తూ అర్ధాంతరంగా తనువు చాలించినా.. ఎనిమిది మంది జీవితాల్లో వెలుగులు నింపి అందరికీ ఆదర్శంగా నిలిచాడు ఈ యువకిరణం.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
