ఐపీఎల్ 2026 సీజన్ ప్లేఆఫ్స్ రేసు ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ప్రతి మ్యాచ్ ఫలితం పాయింట్ల పట్టికలో అనూహ్య మార్పులకు దారితీస్తూ అభిమానులలో ఉత్కంఠను పెంచుతోంది. లీగ్ దశలో బుధవారం ముగిసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ అనంతరం ఏ జట్టు ఎన్ని విజయాలు సాధించాలనే లెక్కలు ఇప్పుడు ఎలా ఉన్నాయంటే.. కొన్ని దిగ్గజ జట్లు ఈ సీజన్లో ఎదురీదుతుండటం క్రికెట్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ప్రస్తుత సమీకరణాల ప్రకారం రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్లు అత్యంత సురక్షితమైన స్థితిలో ఉంది. రాజస్థాన్, బెంగళూరు ఆడిన ఐదు మ్యాచ్లలో నాలుగింట విజయం సాధించి ఎనిమిది పాయింట్లతో మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. మిగిలిన 9 మ్యాచ్లలో కేవలం నాలుగు విజయాలు సాధిస్తే ప్లేఆఫ్స్ బెర్తును ఖాయం చేసుకుంటుంది. ఆ తర్వాత పంజాబ్ కింగ్స్ మెరుగైన స్థితిలో ఉంది. పంజాబ్ మూడు విజయాలు, ఒక రద్దు అయిన మ్యాచ్ పాయింట్తో మూడో స్థానంలో ఉంది. ఈ జట్టు ప్లేఆఫ్స్కు చేరాలంటే మిగిలిన పది మ్యాచ్లలో ఐదు గెలవాల్సి ఉంటుంది.
మరోవైపు సన్ రైజర్స్ హైదరాబాద్ ఆడిన ఐదు మ్యాచ్ల్లో కేవలం రెండు విజయాలు మాత్రమే సాధించింది. దీంతో మిగిలిన 9 మ్యాచ్ల్లో కచ్చితంగా ఆరు గెలిచి తీరితేనే ప్లేఆఫ్స్ చేరుతుంది. ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల పరిస్థితి కూడా సరిగ్గా SRH మాదిరిగా ఉంది. ఇక ముంబై ఇండియన్స్.. ఐపీఎల్ చరిత్రలో అత్యధికంగా ఐదుసార్లు ఛాంపియన్గా నిలిచిన ఈ జట్టు కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే విజయం సాధించింది. అంటే మిగిలిన పది మ్యాచ్ల్లో ఏడింట గెలిచి తీరాల్సిందే. అటు అన్నిటికంటే దారుణమైన పరిస్థితి కోల్కతా నైట్ రైడర్స్ జట్టుది. ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్లలోనూ ఓటమి పాలైన కోల్కతా, ప్లేఆఫ్స్ చేరాలంటే మిగిలిన తొమ్మిది మ్యాచ్లలో ఎనిమిది విజయాలు సాధించాలి. ఇది దాదాపు అసాధ్యమైన పనిగా కనిపిస్తోంది.
ఇది చదవండి: ఒక బ్యాడ్ న్యూస్.. రెండు గుడ్ న్యూస్లు.! హైదరాబాద్ ఊపిరి పీల్చుకో.. కాటేరమ్మ కొడుకు వచ్చేస్తున్నాడు..

