మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, పెరుగుతున్న జెట్ ఇంధన ధరలు, గగనతల ఆంక్షల ప్రభావంతో ఎయిర్ ఇండియా భారీ ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో జూలై వరకు దేశీయ, అంతర్జాతీయంగా దాదాపు 100 విమాన సర్వీసులను తగ్గించాలని సంస్థ నిర్ణయించింది. ఎయిర్ ఇండియా సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ క్యాంప్బెల్ విల్సన్ ఉద్యోగులకు పంపిన సందేశంలో ఇప్పటికే ఏప్రిల్, మే నెలల్లో కొన్ని విదేశీ సర్వీసులను తగ్గించినట్లు తెలిపారు. ప్రస్తుతం పరిస్థితులు మరింత క్లిష్టంగా మారడంతో, జూన్, జూలై నెలల్లో కూడా అదనపు కోతలు అమలు చేయాల్సి వస్తోందని చెప్పారు.
ఎయిర్ ఇండియా ప్రస్తుతం రోజుకు సుమారు 1,100 విమానాలను నడుపుతోంది. అయితే యూరప్, ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా, సింగపూర్ వంటి కీలక అంతర్జాతీయ మార్గాల్లో కార్యకలాపాలను తగ్గించనుంది. ముఖ్యంగా మధ్యప్రాచ్య ఘర్షణల కారణంగా కొన్ని గగనతలాలు మూసివేయబడటంతో విమానాలను ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నడపాల్సి వస్తోంది. దీనివల్ల ప్రయాణ సమయం పెరగడమే కాకుండా ఇంధన వినియోగం కూడా భారీగా పెరిగింది. జెట్ ఇంధన ధరలు కూడా విమానయాన రంగానికి పెద్ద సవాలుగా మారాయి. ఏప్రిల్ 24తో ముగిసిన వారంలో ప్రపంచ సగటు జెట్ ఇంధన ధర బ్యారెల్కు 179.46 డాలర్లకు చేరుకుంది. ఫిబ్రవరి చివరిలో ఇది 99.40 డాలర్లుగా ఉండగా, కేవలం కొన్ని వారాల్లోనే దాదాపు 80 శాతం పెరిగింది. ఈ పెరుగుదల నష్టాల్లో ఉన్న ఎయిర్ ఇండియాపై మరింత భారంగా మారింది.
మార్చి 31, 2026తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి ఎయిర్ ఇండియా గ్రూప్ సుమారు రూ.22,000 కోట్ల నష్టాన్ని నమోదు చేసినట్లు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఖర్చులను నియంత్రించేందుకు, నిర్వహణను స్థిరీకరించేందుకు విమానాల కోత తప్పనిసరి అయిందని సంస్థ భావిస్తోంది. ప్రయాణికులకు, ఉద్యోగులకు కలిగిన అసౌకర్యంపై సంస్థ విచారం వ్యక్తం చేసింది. మధ్యప్రాచ్య పరిస్థితులు త్వరలో సాధారణ స్థితికి చేరుకుని, ముఖ్యంగా హోర్ముజ్ జలసంధి మళ్లీ పూర్తిగా తెరుచుకుంటే కార్యకలాపాలు తిరిగి సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉందని సంస్థ ఆశాభావం వ్యక్తం చేసింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

