
బాపట్ల జిల్లాలోని రేపల్లె డివిజన్లో గత కొంతకాలంగా స్థానికలు కలవరపాటుకు గురవుతున్నారు. తెల్లవారుతుండగానే వారిని భయం వెంటాడుతోంది. ఏ ఊర్లో, ఏగుడిలో.. ఎప్పుడు దొంగలు పడతారో అన్న భయంతో.. ఆయా గ్రామాల ప్రజలు వణికిపోతున్నారు. వరుసగా ఆలయాల్లో జరుగుతున్న దొంగతనాలతో పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. దీంతో ఈ గ్యాంగ్పై స్పెషల్ ఫోకస్ పెట్టిన పోలీసులు.. గుళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురి అరెస్ట్ చేశారు.
తెనాలికి చెందిన విజయ్ కుమార్, సాయి, రాజోలుకు చెందిన పవణ్ కల్యాణ్ ముగ్గురూ కలిసి ఒక ముఠాగా ఏర్పడ్డారు. గత మూడు నెలలుగా రేపల్లె డివిజన్లోని ఆలయాలను టార్గెట్ చేశారు. ఆలయాల్లోని వెండి వస్తువులను అలవోకగా దోచుకుంటూ స్థానికులను ఆందోళనకు గురి చేస్తున్నారు. గత మూడు నెలల కాలంలో పదుల సంఖ్యలోని ఆలయాల్లో దొంగతనాలు చోటు చేసుకున్నాయి. దీంతో బాపట్ల జిల్లా సిసిఎస్ పోలీసులు అప్రమత్తమయ్యారు. వరుసగా జరుగుతున్న చోరీలను అరికట్టేందుకు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి రంగంలోకి దిగారు.
అయితే నిందితులను పట్టుకోవడం పోలీసులకు సవాల్ గా మారింది. ఈక్రమంతో ఈ తరహా దొంగతనాలకు పాల్పడే వారి జాబితా తీశారు. గుంటూరు జిల్లాలో ఇటువంటి దొంగతనాలకు పాల్పడిన వారి వివరాలు సేకరించారు. వారిపై ప్రత్యేక నిఘా పెట్టారు. అనుకున్నట్లుగానే గుంటూరు, తెనాలి, పల్నాడు జిల్లాలో కేసులున్న ముగ్గురే.. బాపట్ల జిల్లాలోనూ చోరీలు చేస్తున్నట్లు గుర్తించి వారిని పట్టుకున్నారు.
వీరి వద్ద నుండి ఆరు లక్షల తొంభై వేల రూపాయల విలువైన వెండి వస్తువులు, పది లక్షల రూపాయల విలువైన బైక్స్ స్వాధీనం చేసుకున్నారు. బైక్లను దొంగతనం చేసి వాటిపై తిరుగుతూ ఆలయాల్లో చోరీలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..