అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటిగా విరాజిల్లుతున్న శ్రీశైలం మహక్షేత్రంలో శ్రీ భ్రమరాంబాదేవికి వార్షిక కుంభోత్సవ వేడుక వైభవంగా జరిగింది. కుంభోత్సవంలో భాగంగా అమ్మవారికి నిమ్మకాయలు గుమ్మడి, కొబ్బరికాయలు, పసుపు, కుంకుమలతో అలానే అన్నాన్ని కుంభరాశిగా పోసి శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారికి సాత్వికబలిగా సమర్పించారు. ఉదయం నుంచి అమ్మవారి గర్భాలయంలో అర్చకులు వేదపండితులు ప్రత్యేక పూజలను నిర్వహించారు.
సాయంత్రం ఈవో శ్రీనివాసరావు దంపతులు, కొబ్బరికాయలు, నిమ్మ, గుమ్మడికాయలతో సాత్విక బలులను సమర్పించారు. అలానే మహామంగళహారతి అనంతరం అమ్మవారి ఉగ్రరూపం స్వామివారిపై పడకుండా స్వామివారి ఆలయ ద్వారాలు మూసివేశారు. మూసేవేతకు ముందు మల్లికార్జునస్వామి లింగరూపాన్ని పెరుగన్నం, ఉల్లిపాయలు, జీలకర్ర, శోంటి భక్షాలతో కప్పేశారు. అనంతరం స్వామివారి అలయంలో పనిచేసే ఉద్యోగి ‘స్త్రీ’ వేషధారణలో అలంకరించి చేతిలో హారతితో వేదమంత్రోత్చారణల మధ్య మంగళవాయిద్యాల నడుమ అమ్మవారి ఆలయానికి తరలిరాగా అమ్మవారి ప్రధానార్చకులు ఆలయద్వారలు తెరచి కుంభహారతినిచ్చారు.
ఆలయ ద్వారాలు తెరచిన వెంటనే అమ్మవారి చూపు శ్రీచక్రం వెనుకున్న కుంభరాశిపై పడి అనంతరం హారతి తెచ్చిన ‘స్త్రీ’ వేశధారిపై పడుతుందని భక్తుల నమ్మకం. కుంభహారతి అనంతరం శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి దర్శనానికి భక్తులు, స్థానికులు బారులు తీరారు. ఈ కుంభోత్సవంలో ఈవో శ్రీనివాసరావు దంపతులతో పాటుగా అధికారులు, అర్చకులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ చూడండి..