ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమరావతిలో పర్యటించనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ ను ఖరారు చేస్తూ.. ప్రధానమంత్రి కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. అమరావతి నిర్మాణ పనుల పునఃప్రారంభోత్సవంతో పాటు రాజధానిలో పలు అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ మే 2న శంకుస్థాపన చేయనున్నారు. రూ.లక్ష కోట్ల విలువైన పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనుండగా.. దీనికి సంబంధించి భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.. సభా వేదికపై ప్రధాని మోదీతోపాటు.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు ఉండనున్నారు.
ఈ క్రమంలో ప్రధాని మోదీ అమరావతి పర్యటనలో కొన్ని మార్పులు చేశారు.. తాజా పరిణామాల నేపథ్యంలో ఆయన పర్యటనలో కొన్ని కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రధాని మోదీ అమరావతిలో నిర్వహించాల్సిన రోడ్ షోను రద్దు చేయాలని భద్రతాధికారులు నిర్ణయించారు. భద్రతా పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని, రోడ్ షోకు ప్రత్యామ్నాయం చూడాల్సిందిగా ప్రధాని భద్రతా బృందం రాష్ట్ర పోలీసులకు సూచనలు ఇచ్చింది. అందులో భాగంగా, ప్రధాని మోదీ ప్రయాణించే వాహనంలోనే లోపల నుంచే ప్రజలకు అభివాదం చేయడానికి భద్రతా సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రధాని మోదీ అమరావతి పర్యటనకు ఖరారైన షెడ్యూల్ ఇదే..
మే 2 న మధ్యాహ్నం 2:55 గంటలకు ప్రధాని మోదీ తిరువనంతపురం నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు.
మధ్యాహ్నం 3:15 గంటలకు అమరావతి హెలిప్యాడ్కు చేరుకుంటారు.
3:25 గంటలకు సభ వేదికకు చేరుకుంటారు.
3:30 గంటల నుంచి 4:45 గంటల వరకు రాజధాని పునఃప్రారంభ సభలో పాల్గొంటారు.
సభ అనంతరం 5:15 గంటలకు ప్రధాని మోదీ మళ్లీ గన్నవరం ఎయిర్పోర్టుకు వెళ్లి అక్కడి నుంచి ఢిల్లీ బయలుదేరతారు.
ప్రధానమంత్రి మోదీ సభకు 100 మంది వీవీఐపీలు, 15 మంది ఎంఐపీలు, 5 వేల మంది వీఐపీలు రానున్నారు.. దీంతో పాటు భారీ జనసమీకరణ కూడా చేయనున్నారు. చుట్టు పక్కల జిల్లాల నుంచి భారీగా ప్రజలు తరలిరానున్నారు. అందుకు అనుగుణంగా పోలీసులు, అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..