ఇరాన్ యుద్ధంలోకి అమెరికా ఎంట్రీ కావడం- గేమ్ఛేంజర్ అవుతుందా? దాడులు చేసిన తర్వాత, ట్రంప్ శాంతిమంత్రం జపించినా, అంతా కూల్ అవుతుందా? ప్రపంచం మీద ఇరాన్ కొత్తగా దాడులు చేయాల్సిన అవసరం లేదు. క్రూడాయిల్ సరఫరా ఆపేస్తామంటే చాలు, మనం హడలిపోతాం.. ఎందుకంటే, క్రూడాయిల్ సరఫరాను ఇరాన్ ఆపేస్తే, అంతర్జాతీయంగా సమస్య వస్తుంది. ఒకవైపు హార్ముజ్ జలసంధి మార్గం మూసివేత.. మరోవైపు క్రూడాయిల్ నిలిపివేతతో.. ధరలు అమాంతం పెరిగితే, మనదేశంలోనూ ధరలు పెరుగుతాయనే ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ క్రమంలో కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి కీలక ప్రకటన చేశారు.
ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం, ఇరాన్లోని అణు కేంద్రాలపై అమెరికా బాంబు దాడులతో పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్కు చమురు సరఫరాలో ఎలాంటి అంతరాయం ఉండదన్నారు కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి. ఈ విషయంలో ప్రజలు ఎలాంటి భయాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. దేశంలోని చమురు కంపెనీల దగ్గర సరిపడా నిల్వలు ఉన్నాయని, వివిధ మార్గాల ద్వారా ఇంధన సరఫరాలు నిరంతరాయంగా అందుతున్నాయన్నారు కేంద్రమంత్రి.
‘‘హార్ముజ్ మార్గం బందైనా భారత్కి ఇబ్బంది లేదు.. వేరే మార్గాల్లో భారత్కు క్రూడాయిల్ వస్తుంది.. 2 మిలియన్ బారెళ్లలోపే హార్ముజ్ గుండా దిగుమతి చేసుకుంటాం.. భారత్కు వేరే మార్గాలనుంచి 4 మిలియన్ బారెళ్ల క్రూడాయిల్ వస్తుంది. మన కంపెనీల దగ్గర మూడువారాల నిల్వలు ఉన్నాయి.. ఇతర మార్గాల్లో క్రూడాయిల్ దిగుమతిపై దృష్టి పెడతాం’’.. అంటూ కేంద్రమంత్రి హర్దీప్సింగ్ పేర్కొన్నారు.
మొత్తంగా.. పశ్చిమాసియా ఘర్షణలతో ముడిచమురు గండం ఏర్పడింది. అమెరికా దాడులతో క్రూడాయిల్ ధరలు భగ్గుమన్నాయి.. 78 డాలర్లకు పైగా బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ట్రేడవుతోంది.. అయితే.. చమురు ధరలు పెరిగితే సామాన్యుడిపై భారం తప్పదని పేర్కొంటున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..