కొత్త జీవితం మొదలై రెండు నెలలే అయింది.. ఇంతలోనే భర్త వేధింపులు మొదలయ్యాయి.. అటు భర్త వేధింపులు తట్టుకోలేకపోయింది.. ఇటు పుట్టింటికి ఏం చేప్పాలో అర్ధం కాలేదు.. దీంతో ఆమె జీవితం ఉక్కిరిబిక్కిరైంది.. పెళ్లైన రెండు నెలలకే భర్త టార్చర్ తో జీవితం మీద విరక్తి ఏర్పడింది.. మనస్థాపంతో కుమిలిపోయింది.. చివరకు ప్రాణాలు తీసుకునేలా దారుణ నిర్ణయం తీసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో బలవన్మరణానికి పాల్పడింది.. భర్త వేధింపులతో నవ వధువు ఆత్మహత్యకు పాల్పడిన దారుణ ఘటన హైదరాబాద్ నగరంలోని కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో చోటుచేసుకుంది.
కూకట్పల్లి హౌసింగ్ బోర్డు (కె.పి.హెచ్.బి) కాలనీలోని ఓ బంగారు నగర దుకాణంలో సేల్స్ మాన్ గా పనిచేస్తున్న శ్రీనివాస్ కు ఖమ్మం జిల్లాకు చెందిన పూజితకి ఏప్రిల్ 16న వివాహం జరిగింది. కొన్ని రోజుల వరకు బాగానే ఉన్న శ్రీనివాస్.. అనంతరం తన వక్రబుద్ధిని బయటపెట్టాడు.. అదనపు కట్నం తీసుకురావాలని పూజితను వేధించడం మొదలుపెట్టాడు.. అంతేకాకుండా తన బంధువులతో కొన్నాళ్ల క్రితం పూజిత కూల్ డ్రింక్ తాగిన వీడియో చూపిస్తూ శ్రీనివాస్ నిత్యం వేధించేవాడు.. భర్త వేధింపులు తీవ్రమవ్వడంతో నవవధువు పూజిత ఆదివారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
పెళ్లైన రెండు నెలలకే పూజిత తన ప్రాణాలను తీసుకోవడం అందరినీ కలచివేస్తోంది. పూజిత బంధువులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పూజిత భర్త శ్రీనివాస్తో పాటు అతని కుటుంబ సభ్యులు మొత్తం ఏడుగురు ఆమెను మానసికంగా వేధించారని ఆరోపించారు. పెళ్లికి 11 లక్షలు ఖర్చు చేయడంతోపాటు కట్నకానుకలు ఇచ్చామని.. ఆ తర్వాత 10 లక్షలు కావాలని అత్తింటి వారితోపాటు భర్త వేధించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. పంట చేతికొచ్చిన తర్వాత ఇస్తామని హామీఇచ్చినప్పటికీ.. వేధించారని పేర్కొన్నారు.
కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. భర్త శ్రీనివాస్ తోపాటు 6గురు కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..