విజయవాడ చెన్నై వందేభారత్ రైలును నరసాపురం వరకూ పొడిగించిన సంగతి తెలిసిందే. ప్రయాణికుల నుంచి వస్తున్న ఆదరణ నేపథ్యంలో ఈ వందేభారత్ రైలును నరసాపురం వరకూ పొడిగించారు. అయితే ఎప్పటి నుంచి ఈ సర్వీసులు అందుబాటులోకి వస్తాయనే దానిపై ఇన్ని రోజులుగా సస్పెన్స్ కొనసాగుతూ వచ్చింది. ఈ సస్పెన్స్కు దక్షిణ రైల్వే క్లారిటీ ఇచ్చింది. చెన్నై సెంట్రల్ నరసాపురం వందేభారత్ రైలు ఎప్పటి నుంచి నడుస్తుందనే దానిపై ఓ ప్రకటన జారీ చేసింది.

అయితే రైల్వే బోర్డు తాజాగా నరసాపురం వరకూ ఈ వందేభారత్ రైలును పొడిగించటంతో జనవరి 12వ తేదీ నుంచి ఈ వందేభారత్ రైలు గుడివాడ, భీమవరం రైల్వేస్టేషన్ల మీదుగా నరసాపురం వరకు నడవనుంది. విజయవాడ రైల్వేస్టేషన్ నుంచి 11.45కి బయల్దేరి.. గుడివాడ రైల్వేస్టేషన్కు మధ్యాహ్నం 12.29కు చేరుకుంటుంది. మధ్యాహ్నం 1.14కి భీమవరం రైల్వే స్టేషన్కు చేరుకోనున్న ఈ రైలు.. నరసాపురం రైల్వేస్టేషన్కు 2.10కి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో అదే రోజు నరసాపురం నుంచి మధ్యాహ్నం 2.50 గంటలకు బయలుదేరనుంది. 3.19కి భీమవరం రైల్వేస్టేషన్ చేరుకుంటుంది. గుడివాడ రైల్వేస్టేషన్కు సాయంత్రం 4.04కి, విజయవాడ రైల్వేస్టేషన్కు 4.50కి చేరుతుంది. విజయవాడ రైల్వేస్టేషన్ నుంచి సాయంత్రం 4.55 గంటలకు బయల్దేరితే.. చెన్నై సెంట్రల్ స్టేషన్కు రాత్రి 11.45గంటలకు చేరుకుంటుంది.
మరోవైపు వందేభారత్ రైళ్లకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో.. నరసాపురం వరకూ ఈ రైలు సర్వీసును పొడిగిస్తూ రైల్వే బోర్డు నిర్ణయం తీసుకుంది. మరోవైపు విజయవాడ బెంగళూరు వందేభారత్ రైలును కూడా నవంబర్ నెలాఖరులో ప్రారంభిస్తారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ రైలు కోసం చాలా రోజుల నుంచి డిమాండ్ ఉంది. విజయవాడ బెంగళూరు మార్గంలో కొండవీటి ఎక్స్ప్రెస్ ప్రస్తుతం రాకపోకలు సాగిస్తోంది.
అయితే ఈ ఎక్స్ప్రెస్ రైలు వారంలో కేవలం మూడ్రోజులే అందుబాటులో ఉంటోంది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని విజయవాడ బెంగళూరు వందేభారత్ రైలును ప్రారంభించే ఆలోచన చేశారు. ఈ రైలు అందుబాటులోకి వస్తే 9 గంటల్లోనే విజయవాడ నుంచి బెంగళూరుకు చేరుకునే అవకాశం ఉంది. తిరుపతి మీదుగా ఈ రైలు రాకపోకలు సాగించనుంది.


