
ఇక తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల కోసం అన్ని సౌకర్యాలు, ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ ఈవో తెలిపారు. భక్తుల కోసం 7 లక్షల లడ్డలను నిల్వగా ఉంచామని.. వాటిని పంపిణీ చేయడానికి అదనంగా 11 కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు శ్యామలరావు వెల్లడించారు. భద్రత కోసం 1200 టీటీడీ విజిలెన్స్ సిబ్బందితో పాటు.. 3900 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. తిరుమలలో 7 ప్రాంతాల్లో 4 వేల వాహనాలకు పార్కింగ్ సౌకర్యం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఇక కొండ కింద తిరుపతిలో 6 వేల వాహనాలకు పార్కింగ్ సౌకర్యం కల్పించినట్లు చెప్పారు.
ఇక తిరుమలలో వైద్య సేవల కోసం అదనంగా 45 మంది డాక్టర్లు.. 65 మంది మెడికల్ సిబ్బందిని నియమించినట్లు ఈవో శ్యామలరావు తెలిపారు. బ్రహ్మోత్సవాలు సందర్భంగా ఏదైనా సమస్య వస్తే ఫిర్యాదు చేసేందుకు 155257 కాల్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇక నిత్యం 400 ఆర్టీసీ బస్సుల ద్వారా 2 వేల ట్రిప్పులు నడిపేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. 21 రాష్ర్టాల నుంచి విచ్చేసిన 160 కళా బృందాలు సాంస్కృతిక ప్రదర్శనలు ఇస్తారని వెల్లడించారు. గరుడ సేవ రోజున సాయంత్రం 6:30 గంటల నుంచి 11:30 గంటల వరకు వాహన సేవ ఉంటుందన్నారు. గరుడ సేవ రోజున 24 గంటల పాటు ఘాట్ రోడ్డు, నడకమార్గాలు తెరిచి ఉంచనున్నట్లు వెల్లడించారు. 4 వేల మంది శ్రీవారి సేవకులతో భక్తులకు సేవలు అందించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. భక్తుల సౌకర్యార్థం 28 ప్రాంతాల్లో ఎల్ఈడీ స్ర్కీన్స్ ఏర్పాటు చేస్తామని చెప్పారు.

