India
oi-Syed Ahmed
లోక్ సభ (lok sabha)లో ప్రస్తుతం ఉన్న 543 సీట్లను 850కి పెంచడంతో పాటు మహిళా రిజర్వేషన్ల అమలుపై కేంద్రం ఇవాళ క్లారిటీ ఇచ్చింది. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేయడంతో పాటు, కొత్త నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియకు కూడా ఇది మార్గం సుగమం చేస్తుంది. దీనికి సంబంధించిన ముసాయిదా బిల్లుల్ని కేంద్ర ప్రభుత్వం ఎంపీలకు పంపింది. ఈ మేరకు ఈ నెల 18, 19 తేదీల్లో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు పెట్టి బిల్లుల్ని ఆమోదిస్తారు.
పార్లమెంట్, రాష్ట్ర శాసనసభలలో మహిళలకు ఉన్న 33 శాతం కోటాకు సంబంధించిన నిబంధనలను సవరించడానికి, , 2011 జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేపట్టడానికి రెండు రోజుల పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. నియోజకవర్గాలను పునర్విభజన చేయడం ద్వారా కోటాను మరింత సులభంగా అమలు చేయడానికి వీలుగా సీట్లను పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్లాన్ ప్రకారం రాష్ట్రాలకు 815 సీట్లు, కేంద్ర పాలిత ప్రాంతాలకు 35 సీట్లు కేటాయించారు. దీంతో లోక్ సభలో మొత్తం సీట్ల సంఖ్య 850కి చేరుతుంది. ఈ మార్పులు 2029 లోక్సభ ఎన్నికల నుండి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.

మరోవైపు విపక్షాలు కేంద్రం ప్రతిపాదనల్ని వ్యతిరేకిస్తున్నాయి. ప్రభుత్వం చేపట్టిన నియోజకవర్గాల పునర్విభజనను, ముఖ్యంగా 2011 జనాభా లెక్కల డేటాను ఉపయోగించడాన్ని ప్రతిపక్షాలు తప్పుబడుతున్నాయి. ఈ ప్రక్రియను 2021 జనాభా లెక్కల గణాంకాల ఆధారంగా నిర్వహించాలని ఆప్, ఆర్జేడీ, డీఎంకే వంటి పార్టీలు వాదిస్తున్నాయి. వెనుకబడిన తరగతుల మహిళలకు ‘కోటాలో కోటా’ కల్పించాలన్న చిరకాల డిమాండ్పై కూడా ఇండియా కూటమి పార్టీలు స్పష్టత కోరబోతున్నాయి.

ఢిల్లీలోని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో ఆప్తో సహా ప్రతిపక్ష నాయకులు, మిత్రపక్షాల వ్యూహాత్మక సమావేశం జరగనుంది. ఎన్నికలు జరగనున్న పశ్చిమ బెంగాల్, తమిళనాడులలో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే నాయకులు ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉంది. రాజ్యాంగ సవరణలను ఆమోదించడానికి పార్లమెంటులో మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరం. దీంతో బీజేపీకి ప్రతిపక్షాల మద్దతు అవసరం కానుంది. తమ డిమాండ్లను ముందుకు తీసుకెళ్లడానికి, ప్రభుత్వం నుండి మరింత స్పష్టత కోరడానికి ప్రతిపక్ష కూటమి ఈ మెజారిటీపైనే ఆధారపడుతోంది.

