ఏపీలో ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాలను బుధవారం ప్రకటించనున్నారు. ఈ విషయాన్ని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. విద్యార్థులకు ఆల్ ద బెస్ట్ చెప్పారు. ఉదయం పది గంటల 31 నిమిషాలకు ఇంటర్ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలను అధికారిక వెబ్ సైట్తో పాటుగా.. మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కూడా తెలుసుకునేందుకు అవకాశం కల్పించారు.

ఏపీ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు.. ఇలా చెక్ చేసుకోండి..
మరోవైపు వెబ్సైట్ ద్వారా ఏపీ ఇంటర్ ఫలితాలు చూడాలనుకుంటే.. ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్సైట్ https://resultsbie.ap.gov.inను సందర్శించాల్సి ఉంటుంది. వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ మొదటి సంవత్సరం లేదా రెండో సంవత్సరం రిజల్ట్స్ ఆప్షన్ ఎంచుకోవాలి. అనంతరం విద్యార్థికి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్, వివరాలు నమోదు చేస్తే.. ఇంటర్ ఫలితాలు తెలుస్తాయి.
మనమిత్ర వాట్సాప్ ద్వారా ఇంటర్ ఫలితాలు..
మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ సేవలు అందిస్తున్న సంగతి తెలిసిందే. దీని ద్వారా కూడా ఏపీ ఇంటర్ పబ్లిక్ పరీక్షల ఫలితాలు తెలుసుకోవచ్చు. ఇందుకోసం వాట్సాప్లో 9552300009 నెంబర్కు హాయ్ అని మెసేజ్ పెట్టాలి. అనంతరం మెనూ వస్తుంది. అందులో సెలెక్ట్ సర్వీస్లో విద్యా సేవలు అనే ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఏపీ ఇంటర్ ఫలితాలు 2026ను ఎంచుకోవాలి. ఎంచుకున్న అనంతరం హాల్ టికెట్ నెంబర్ నమోదు చేసి ఫలితాలు పొందవచ్చు.
మరోవైపు ఇటీవలే తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు ప్రకటించారు. తాజాగా ఏపీలోనూ ఇంటర్ ఫలితాలు వెల్లడిస్తున్నారు. ఇంటర్ పరీక్షల ఫలితాల్లో గతేడాది బాలికలు పైచేయి సాధించారు. అలాగే మొదటి సంవత్సరం 70 శాతం, రెండో సంవత్సరం 83 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. 2025 ఇంటర్మీడియట్ ఫలితాల్లో కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలు టాప్ త్రీలో నిలిస్తే… ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో అల్లూరి జిల్లా, సెకండియర్ ఫలితాల్లో చిత్తూరు జిల్లా ఆఖరి స్థానంలో నిలిచాయి.


